నాసిరకం చేపలు వేసి రైతులను మోసం చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాలోని అన్నపూర్ణ చౌరస్తా వద్ద గంగపుత్రులకు జీవనదారం అయిన చేప పిల్లల పంపిణి లో గత ప్రభుత్వం నాసిరకం చేపలు పంపిణి చేసింది.
గంగపుత్రుల నోట్లో మట్టి కొట్టారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితం జగిత్యాల సమీపంలో గల ముప్పాలా చెరువు, తిమ్మాపూర్ చెరువు, రాజుల చెరువు లో రవ్వులు అనే ఫిష్ సీడ్ గత ప్రభుత్వం ఇస్తామని చెప్పింది. సిల్వర్ ఫిష్ అని ఎదో కొత్త రకం చేప సీడ్ ఇచ్చారని ఏడాది కాలంగా పెరగడం లేదని మత్స్యకారులు తెలిపారు.
రవ్వులు, బొచ్చేలు, బంగారు తీగ సీడ్ ఇస్తామని చెప్పి చివరికి సిల్వర్ ఫిష్ సీడ్ ఇచ్చారని గంగపుత్రులు అన్నారు. వీటిని వ్యాపారులు గాని, ప్రజలు గాని కొనడం లేదని తాము నష్టపోతున్నామని వాపోయారు. గతంలో సకాలంలో చేప పిల్లలు పోయాక తాము ఇబ్బదులు ఎదురుకుంటున్నామని అన్నారు.
కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని గంగపుత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేప పిల్లల పంపిణితో తమ జీవితాలని మారుస్తామన్నా కేసీఆర్ ప్రభుత్వం తమను మోసం చేసిందని మత్స్యకారలు అన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్ని గంగపుత్రులు వెల్లడించారు.
కొత్త ప్రభుత్వం గంగపుత్రుల పరిస్థితిని అర్థం చేసుకొని బాధ్యుడైనా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కొరారు. తమకు నాణ్యమైన చేపలు పంపిణి జరిగేలా చూడాలని గంగపుత్రులు అధికారులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.