రోహిత్ శర్మని ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించడంతో అభిమానులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు. కేవలం అది ఒక ఫ్రాంచైజీ మాత్రమేనని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఐపీఎల్ లీగ్ కి, టీమ్ ఇండియాకి అసలు సంబంధమే లేదని అన్నారు.
ముంబై ఇండియన్స్ అనేది ఒక వ్యాపార సంస్థ, భారతదేశాన్ని రిప్రజెంట్ చేసేది బీసీసీఐ, రెంటికీ ఏమైనా అసలు సంబంధం ఉందా? పొంతన ఉందా? అసలు దాని ప్రభావం దీనిపై ఎందుకు ఉంటుందని సీరియస్ గా అన్నారు.
వచ్చే టీ 20 వరల్డ్ కప్ నకు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉంటాడని తెలిపారు. మొత్తం మూడు ఫార్మాట్లకి ఎప్పటిలా తనే కెప్టెన్ అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఒక న్యూస్ పేపర్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
ఇటీవల జరిగిన బీసీసీఐ బోర్డు సమావేశంలో రోహిత్ శర్మ వర్చువల్ గా పాల్గొన్నాడని తెలిపారు. ఇంకా ఆరునెలల సమయం ఉంది కాబట్టి, అప్పుడే ప్రకటించడం ఎందుకని చెప్పలేదని అన్నారు. ఆల్రడీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అగార్కర్ ఇద్దరూ మౌఖికంగా ఒప్పుకున్నారని తెలిపారు.
రోహిత్ శర్మ స్వీయ ప్రతిభతో, ఎంతో కష్టపడి ఒక స్థాయికి వచ్చిన తర్వాత టీమ్ఇండియాకు కెప్టెన్ అయ్యాడని అన్నారు. బీసీసీఐ అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించలేదనే సంగతి అందరూ గుర్తించాలని అన్నారు. తనంతట తాను ఆడకపోవడం వల్ల కొత్తవారికి అవకాశాలు ఇస్తున్నట్టు తెలిపారు.
నిజమైన కెప్టెన్ చేయాల్సిన పని కూడా అదేనని అన్నారు. తన తర్వాత వారసులను భారతదేశానికి అందించే బాధ్యత కెప్టెన్ పై కూడా ఉంటుందని అన్నారు. ఆ ఎక్సర్ సైజ్ మాత్రమే జరుగుతోందని క్లారిటీ ఇచ్చారు. దీంతో రోహిత్ అభిమానులే కాదు, భారతదేశ అశేష క్రికెట్ అభిమానులు ఆ మాటతో ఊపిరి పీల్చుకున్నారు.
ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ ప్రకటించే సమయంలో రోహిత్ శర్మ ఎక్కడున్నాడో తెలుసా?
ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షిక ఫంక్షన్లో ఉన్నాడు. ఇదండీ సంగతి…రోహిత్ ని ప్రశాంతంగా సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ ఆడుకోనిద్దాం అని సామాజిక మాధ్యమాల్లో పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి.