IPL 2024 Auction : ఒకటో సారి..రెండో సారి..
ఆ.. రండి బాబు రండి..
ఆలసించిన ఆశాభంగం
మంచి తరుణం మించిన దొరకుడు
రండి బాబు రండీ..
ఈ మాట విన్నారా? ఎప్పుడో, ఎక్కడో విన్నట్టు అనిపిస్తోందా?
నేటి తరానికి తెలీదుగానీ, పాతవారికి సుపరిచితం…
ధర్మం కోసం సత్యహరిశ్చంద్ర తన భార్యని, కుమారుడిని కూడా అమ్మేస్తాడు. వారిద్దరినీ ఒక వీధిలో పెట్టి నక్షత్రకుడు పలికిన నాటి పలుకులే…నేటికి వేలం పాటలో సంప్రదాయంగా వస్తున్నాయి.
తరాలు మారినా, కాలం మారినా, ఆధునికత పెరిగినా వేలం పాట నిర్వహణలో నాటి నక్షత్రకుడు పాటించిన విధానమే నేటికీ కొనసాగడం విశేషం. ఒకరకంగా చెప్పాలంటే వేలం పాటకు ఆదిగురువు నక్షత్రకుడు అనే చెప్పాలి. అతని శిష్యులే వీరందరూ అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు.
ఇంతకీ విషయం ఏమిటంటే క్రికెట్ ఆడే దేశాలన్నీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఐపీఎల్ వేలం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఒక మహిళ వేలం నిర్వహిస్తున్నారు.
ఇప్పుడు తనే ఒకటోసారి, రెండోసారి అని చెబుతారన్నమాట. ఎవరు ఎక్కువ ధర చెబితే అక్కడ కట్ చేస్తారన్నమాట.
ఇంతకీ ఎవరీ మహిళ అని నెట్టింట అంతా తెగ పరిశోధనలు చేస్తున్నారు. ముంబై నివాసి అయిన ఈమె పేరు మల్లికా సాగర్. 2001 నుంచి డబ్ల్యూపీఎల్ సహా అనేక వేలంపాటలను నిర్వహించిన అనుభవం ఆమెకు ఉంది.
ఐపీఎల్ వేలం నిర్వహించనున్న మల్లిక సీరియల్ నెంబర్ నాలుగు. ఇప్పటి వరకు ముగ్గురు నిర్వహించారు. అందులో ఒకరు బ్రిటన్ కు చెందిన రిచర్డ్ మ్యాడ్లీ 2008 నుంచి 2018 వరకు దాదాపు పదేళ్లపాటు ఐపీఎల్ వేలం నిర్వహించారు. ఆ తర్వాత బ్రిటన్ కు చెందిన హ్యూజ్ ఎడ్మియేడ్స్ ఐపీఎల్ ఆక్షనీర్గా 2023 వరకు వ్యవహరించారు.
2022 మెగా వేలం సమయంలో ఎడ్మియేడ్స్ హాస్పిటల్ పాలవడంతో ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన చారు శర్మ వేలం ప్రక్రియను కొనసాగించారు. అలా ఐపీఎల్ వేలం నిర్వహించిన తొలి భారతీయుడు చారు శర్మనే. ఇప్పుడు మల్లికా సాగర్ తర్వాత పాత్రను ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తారనేది చూడాల్సిందే.
అయితే ఇంతకుముందు మల్లికా సాగర్ 2023 విమెన్స్ ప్రీమియర్ లీగ్, డబ్ల్యూపీఎల్ 2024 వేలం పాటలను తనే నిర్వహించారు. 2021లో ప్రొ కబడ్డీ లీగ్ వేలం నిర్వహించిన అనుభవం కూడా ఆమెకు ఉంది. ముంబైకి చెందిన మల్లికా సాగర్… ఒక ఆర్ట్ కలెక్టర్. భారతీయ కళల్లో ఆమె నిపుణురాలు.
ముంబై ఆర్ట్ గ్యాలరీస్లో వేలం నిర్వహించిన అనుభవం ఆమెకుంది. 26 ఏళ్ల వయసులో ఆమె తొలిసారి వేలం ప్రక్రియను నిర్వహించారు. ఇప్పుడు తన వయసు 46 సంవత్సరాలు. అంటే 20 ఏళ్లుగా ఆమె వేలం పాటలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన ఐపీఎల్ నిర్వహించేందుకు ఆ అనుభవమే ఉపయోగపడింది. ఒక మహిళా కొన్ని కోట్ల రూపాయల విలువైన ఆటగాళ్లను అందించే ప్రతిష్టాత్మకమైన ఐపీఎల్ వేలం నిర్వహించడం అరుదైన విషయంగా అందరూ పేర్కొంటున్నారు. ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.