గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు రామాలయం వద్ద ఉన్న వైసీపీ ఫ్లెక్సీని తొలగించారు. ఫ్లెక్సీని తొలగించడం పై ఆలయ కమిటీ సభ్యులతో వైసీపీ నాయకులు ఘర్షణకు దిగారు. ఆలయ కమిటీ తొలగించిన ఫ్లెక్సీని వైసీపీ నాయకులు తిరిగి ఏర్పాటు చేశారు.
గ్రామంలో ఉన్న అన్ని ఫ్లెక్సీలను తొలగించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. టిడిపి ఫ్లెక్సీని కూడా తొలగించాలని వైసీపీ నాయకులు పట్టుపట్టారు. దాంతో అక్కడే ఉన్న టిడిపి నాయకులకు, వైసీపీనాయకులకు గోడవ జరిగింది. రెండు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు దూషణలకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది .
సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని రెండు వర్గాల మధ్య పోలీస్ జీప్ అడ్డుపెట్టారు. రాముల వారి గుడి ప్రాంతంలో ఉన్న అందరినీ పంపించేశారు. అనంతరం పంచాయతీ సిబ్బంది వచ్చి తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీ ఫ్లెక్సీలను ట్రాక్టర్ లో వేసి తీసుకెళ్లారు. పోలీసులు సమయానికి ఘటనా ప్రాంతానికి చేరుకుని గొడవ పెద్దది కాకుండా ఆపడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.