JN1 Variant: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇన్ని రోజులు కాస్త ఊపిరిపీల్చుకున్న జనానికి మళ్లీ గుబులు రేపుతోంది. దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళలో కొత్త వేరియంట్ కేసులు రెట్టింపవుతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా కరోనాతో ఐదుగురు చనిపోగా.. వీటిలో నాలుగు మరణాలు కేరళలోనే నమోదయ్యాయి. ఇండియా సహా 38 దేశాల్లో కొత్త వేరియంట్ JN-1 గుర్తించారు.ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాలకు సూచించింది. దీంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
అన్ని రాష్ట్రాలు, యూటీలకు సోమవారం కేంద్రం లేఖ రాసింది. కేసుల పెరుగుదల, జేఎన్-వన్ వేరియంట్ గుర్తించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయిలో కోవిడ్ పరీక్షలు జరిగేలా చూడాలని స్పష్టం చేసింది. ఆర్టీపీసీఆర్ టెస్టులను పెంచాలని ఆదేశించింది. అదేవిధంగా కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించేందుకు పాజిటివ్ శాంపిళ్లను సంబంధిత ల్యాబ్లకు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపాలని కోరింది.
గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి చర్యల వల్లే కరోనా వ్యాప్తిని కట్టడి చేశామని, అయితే కొవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉందని ఆందోళన వ్యక్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మహమ్మారి ప్రవర్తన భారత వాతావరణ పరిస్థితులు, ఇతర సాధారణ వ్యాధి కారకాలతో స్థిరత్వం పొందిందని లేఖలో పేర్కొంది. ఇటీవలి కాలంలో కేరళతో సహా పలు రాష్ట్రాల్లో కేసులు స్వల్పంగా పెరుగుతుండటాన్ని ప్రస్తావించింది. రాబోయే పండుగ సీజన్ నేపథ్యంలో వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కోరింది కేంద్రం. ఇన్ఫ్లూయెంజా వంటి కేసులను పర్యవేక్షించాలని, జిల్లాల వారీగా నివేదించాలని సూచించింది. తద్వారా కేసుల పెరుగుదల ట్రెండ్ను ముందే గుర్తించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది.
జేఎన్ 1 ఇన్ఫెక్షన్ ఇతర వేరియంట్ల కంటే భిన్నంగా వ్యాధి లక్షణాలను కలుగజేస్తుందా అనే దానిపై స్పష్టత లేదని కేంద్రం పేర్కొంది. జేఎన్ 1 తీవ్రత పెరిగే సూచన కూడా లేదని, ప్రస్తుతానికి ఉన్న ఇతర వేరియంట్లతో పోలిస్తే జేఎన్ 1 ప్రజారోగ్యానికి ఎక్కువ ముప్పు కలిగిస్తుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. కొవిడ్-19 సోకిన వారికి ఇప్పుడు ఇస్తున్న ట్రీట్మెంటే జేఎన్ 1కు కూడా సమర్థంగా పనిచేస్తుందని, అప్డేటెడ్ వ్యాక్సిన్లు కొత్త వేరియంట్ నుంచి రక్షణ కల్పిస్తాయని భావిస్తున్నట్టు వెల్లడించింది.
కొవిడ్ కేసుల పెరుగుతుండడంతో మన పక్కరాష్ట్రం కర్ణాటక ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. 60 ఏండ్లు పైబడిన వారు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది. ఇటు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశించారు. అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలన్నారు. ముఖ్యంగా కేరళలో జేఎన్1 వేరియంట్ వెలుగుచూసిన నేపథ్యంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాబోయే పండుగల సీజన్ దృష్ట్యా ప్రజలు అవసరమైన మేరకు మాస్కులను ధరించాలన్నారు. కొవిడ్ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందని, వ్యాధినిర్ధారణ పరీక్షలకు కావాల్సిన కిట్స్, చికిత్సకు అవసరమైన మందులు ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
.
.