డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు యువత బానిసలు అవుతూ భవిష్యత్తును అంధకారంగా మార్చుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకీ ఈ డ్రగ్స్ భూతం.. మరింత ప్రమాదకరంగా మారుతున్న క్రమంలో సీఎం రేవంత్ ఆదేశాలతో.. డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం వడివడిగా అడుగులు వేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తో నార్కోటిక్, పోలీస్ ఉన్నతాధికారుల సమావేశం తర్వాత.. రెండు నెలల్లోనే హైదరాబాద్లో డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించేలా చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు.
ఈ క్రమంలోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే నిన్న హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి భారీస్థాయిలో డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. డ్రగ్స్ విషయం లో నూతన ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని.. రానున్న నూతన సంవత్సర వేడుకల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని పబ్స్, బార్ లపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందని రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.
కుషాయిగూడ, జూబ్లీహిల్స్, ఎస్ఆర్ నగర్.. ఏరియాల్లో వేర్వేరు ఘటనల్లో నిందితులను పట్టుకున్న నార్కోటిక్ అధికారులు.. న్యూ ఇయర్ టార్గెట్ గానే భారీగా పక్క రాష్ట్రాల నుంచి డ్రగ్స్ ని సరఫరా చేసినట్లు గుర్తించారు. అయితే ఆయా ఘటనల్లో నిందితులు డ్రగ్స్ సరఫరా కోసం కొత్త టెక్నిక్ లను ఉపయోగించడం అధికారులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. నిందితులు వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ లాగా డ్రగ్స్ అమ్మడానికి చిన్న పాకెట్స్ గా తయారు చేసి.. వాటిని బస్సుల్లో తరలించడం జరిగిందని పోలీసులు తెలిపారు.