Nagpur Congress Rally : కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రూపొందించింది. మహారాష్ట్రలోని నాగ్పూర్ కేంద్రంగా భారీ ర్యాలీ నిర్వహించనుంది. RSS హెడ్క్వార్టర్స్ ఉండటంతో నాగ్పూర్ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఏకంగా 10 లక్షల మంది కార్యకర్తలతో తమ బలాన్ని చాటి చెప్పేందుకు సిద్ధమవుతోంది గ్రాండ్ ఓల్డ్ పార్టీ.
ఈ మెగా ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులందరూ హాజరుకానున్నారు. ఆలిండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
నాగ్పూర్ ర్యాలీలో రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా కార్యకర్తలు పాల్గొంటారని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే ప్రకటించారు. లోక్సభ ఎన్నికలకు కేవలం మూడు నెలలే సమయం ఉందని పటోలే అన్నారు. ఈ డిసెంబర్ 28 కాంగ్రెస్ 139వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది.
మహారాష్ట్రను ఈ ర్యాలీ కోసం ఎన్నుకోవడం వెనుక మరో కారణం కూడా కనిపిస్తోంది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ స్థానాలు ఉన్నాయి. స్థానాల సంఖ్య పరంగా ఉత్తరప్రదేశ్ తర్వాత రెండవ అతిపెద్ద రాష్ట్రం ఇది. 2014లో లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో రెండు సీట్లే గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో అయితే కేవలం ఒక సీటుకే పరిమితమైంది. అయితే ఈ సారి సీన్ మార్చాలన్న ఉద్దేశంలో ఉంది కాంగ్రెస్ అధిష్టానం.
గత నెలలో జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత కాంగ్రెస్ ఆశలు మహారాష్ట్రపైనే ఉన్నాయి. ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్, శరద్ పవార్ NCP బలమైన మద్దతుతో.. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ తన పనితీరును మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. ఈ ర్యాలీకి తెలంగాణ నుంచి 50 వేల మంది హాజరవుతారని టీపీసీసీ నేత షబ్బీర్ అలీ తెలిపారు.