Nara Lokesh Yuvagalam : నారా లోకేష్ యువగళం చరిత్ర సృష్టించింది. సైలెంట్ అయిన టీడీపీ శ్రేణులను తట్టి లేపింది. యువనేతకు మంచి మాస్ ఇమేజ్ తెచ్చి పెట్టింది. వరుస ప్రసంగాలు, జనంతో ముఖాముఖి, ప్రజా సమస్యలను వినడం, పరిష్కరించడం ఇవన్నీ లోకేష్ నాయకత్వ పటిమను మరింత పెంచేందుకు కారణమయ్యాయి. అసలు యువగళం పాదయాత్ర లోకేష్ కు, అటు పార్టీకి జనంలో క్రేజ్ ను మరింత పెంచాయా? ప్లస్ లు ఏంటి.. మైనస్ లు ఏంటి?
నిర్బంధాలను దాటుకుని.. అడ్డంకులను అధిగమించి.. నేనున్నానంటూ అడుగులో అడుగులు వేసి.. ప్రజా సమస్యలపై సమర శంఖం పూరించి.. యువగళాన్ని ప్రజాగళంగా మార్చేసి లోకేష్ సాగించిన మహా పాదయాత్ర పరిసమాప్తమైంది. నారా లోకేష్ రాజకీయ పరిణతి సాధించడానికి, ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకోవడానికి.. ప్రభుత్వాన్ని ఎదురించడానికి యువగళం పూర్తిస్థాయిలో ఉపయోగపడింది.
జనవరి 27న మొదటి అడుగు.. డిసెంబర్ 18తో పరిసమాప్తం.. కుప్పం టూ అగనంపూడి.. యువగళం జనగళమై సాగిన ప్రస్థానంలో ఎన్నెన్నో మలుపులు.. ఎన్నెన్నో పాఠాలు.. ఇంకెన్నో తీపి గుర్తులు. మరెన్నో ప్రతిబంధకాలు.. అయినా ఎక్కడా అడుగు వెనక్కు పడలేదు. కుప్పం నుంచి మొదలైన లోకేష్ యువగళం పాదయాత్ర విశాఖ జిల్లా అగనంపూడిలో ముగిసే దాకా ఎన్నో కీలక ఘట్టాలకు సాక్షంగా నిలిచింది.
ఎండనక, వాననక.. చలికి లెక్కచేయక.. సాగించిన యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మైలురాయిగా మారింది. గతంలోనూ చంద్రబాబు, జగన్, షర్మిల చేపట్టిన పాదయాత్రల మాదిరిగానే రాష్ట్రాన్నంతా చుట్టి వచ్చే అవకాశం నారా లోకేష్ కు ఈ యువగళం పాదయాత్ర ద్వారా కలిగింది. ఈ జనయాత్రను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు లోకేష్.
ఒకటి కాదు రెండు కాదు.. 226 రోజులు.. 3132 కిలోమీటర్ల నడక.. జనజాతరలా సాగిన యువగళంతో ఎన్నికల సమర శంఖాన్నే పూరించారు నారా లోకేష్. ఆంధ్రరాష్ట్రాన్ని పూర్తిగా అధ్యయనం చేసేందుకు, వివిధ వర్గాల ప్రజల కష్ట సుఖాలను తెలుసుకునేందుకు ఈ యువగళం పూర్తిగా ఉపయోగపడింది. రాజకీయ నాయకుడిగా లోకేష్ మరో మెట్టు ఎదిగేందుకు దోహద పడింది..
ప్రత్యర్థుల కవ్వింపులు.. పోలీసుల నిర్బంధాలు.. పొలిటికల్ టెన్షన్లు, అలజడులు.. చంద్రబాబు అరెస్టు… ఇవన్నీ యువగళం పాదయాత్రపై పెద్ద ఎఫెక్టే చూపించాయి. అయినా సరే అనుకున్న యాత్రను దిగ్విజయంగా కంప్లీట్ చేశారు నారా లోకేష్. ప్రభుత్వ విధానాలపై గళాన్ని పెంచారు. యాత్రలో ప్రతి అంశంపై ప్రశ్నించారు. బాధితులకు తానున్నానంటూ భరోసా ఇచ్చారు. సీఎం జగన్ పార్టీ దూకుడుతో నిస్తేజంగా మారిపోయిన తెలుగుదేశం శిబిరంలో ఉత్సాహాన్ని నింపడంలో ఈ యువగళం పాదయాత్ర సక్సెస్ అయింది.
ఏపీలోని 11 ఉమ్మడి జిల్లాలు.. 97 అసెంబ్లీ నియోజకవర్గాలు.. 232 మండలాలు.. 2028 గ్రామాల మీదుగా సాగిన లోకేష్ యువగళం.. ఆంధ్రలో ప్రతి గడప గడపకు తన సందేశాన్ని చేర్చడంలో విజయవంతమైంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర విశాఖ జిల్లా అగనంపూడిలో ముగించారు. అదే సెంటిమెంట్ ఆధారంగా ఇప్పుడు నారా లోకేష్ కూడా తండ్రి బాటలో అదే ప్లేస్ లో యువగళం పాదయాత్రను పరిసమాప్తం చేశారు. పాదయాత్రలు రాజకీయ నాయకుల జీవితాలను మార్చేసిన సందర్భాలు దేశంలో ఎన్నో ఉన్నాయి. చాలా ఉదాహరణలు ఉన్నాయి. నాయకత్వ పటిమ పెంచుకునేందుకు రాజకీయాల్లో రాటు దేలేందుకు, జనంతో మమేకం అయ్యేందుకు, వారి కష్టనష్టాలు తెలుసుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి. కష్టాన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి చూస్తేనే అసలు విషయం తెలుస్తుంది. ఈ విషయాన్ని పసిగట్టిన వారంతా పాదయాత్రలు చేసే పైకి వచ్చారు. ఇప్పుడు లోకేష్ విషయంలోనూ అదే జరిగింది.
ఓవైపు పార్టీని, ఇంకోవైపు ప్రజలను నడిపించే శక్తిగా, యువ నాయకుడిగా తన సత్తా చాటుకునేందుకు యువగళం పాదయాత్ర నారా లోకేష్ కు బాగానే ఉపయోగపడింది. జనంలో ఒక్కసారి నమ్మకం రావాలి. ఆ నమ్మకం సాధించే దిశగా లోకేష్ మరో మెట్టు ఎక్కారనే చెప్పొచ్చు. రాయల సీమ నుంచి ఉత్తరాంధ్ర దాకా అదే ఉత్సాహం, అదే ప్రోత్సాహం. శ్రేణులు, ప్రజల నుంచి ఘన స్వాగతాలు.., ముఖాముఖి మీటింగ్ లు, రచ్చబండ కార్యక్రమాలు.. సభలు అన్నిటినీ టీడీపీ కమిటీలు దిగ్విజయంగా పూర్తి చేశాయి.
రాజకీయాల్లో మరింత రాటుదేలేందుకు, ప్రజానాయకుడిగా ఎదిగేందుకు యువగళం పాదయాత్ర లోకేశ్కు ఎంతో ఉపయోగపడింది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుని రాజకీయాల్లో ప్రవేశించిన లోకేశ్, మొదట్లో పూర్తిగా పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల సంక్షేమం కోసం ఎక్కువ సమయం కేటాయించారు. ఎమ్మెల్సీగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు పాదయాత్రలో మండుటెండలు, జోరువానలు, వణికించే చలిలో.. కొన్ని వేల కిలోమీటర్లు నడిచి… నాయకుడిగా తననుంచి జనం ఏం ఆశిస్తున్నారో తెలుసుకునే ఛాన్స్ కలిగింది. నెలల తరబడి కుటుంబానికి దూరంగా రోడ్లపైనే ఉండటం, రోజూ వందలసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలను కలవడం, వారు చెప్పింది వినడం వంటివి లోకేశ్ను నాయకుడిగా మరింత రాటుదేల్చాయి. పాదయాత్రలో చాలా వరకు జనం మాట వినేందుకే మొగ్గు చూపారు లోకేష్.
పాదయాత్ర జరుగుతుండగానే.. తారకరత్న మరణం నారా నందమూరి కుటుంబాలకు పెద్ద షాకే ఇచ్చింది. లోకేష్ కు మద్దతుగా తారకరత్న కీ రోల్ పోషించాలని డిసైడై… యువగళంలో తన పాత్ర పోషించేందుకు ముందుకొచ్చారు. యాత్రలో ఉండగానే గుండెపోటుతో కన్నుమూశారు. ఓవైపు తారకరత్న మృతి లోకేష్ ను కలిచివేసినా.. జనం కోసం అడుగు ఆపలేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లాంటి సందర్భాల్లో తప్ప గ్యాప్ లేకుండా పాదయాత్ర కంటిన్యూ చేశారు. సెప్టెంబరు 9న చంద్రబాబును సీఐడీ అరెస్టు చేయడంతో.. పాదయాత్రకు చాలా గ్యాప్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోర్టులు, కేసుల చుట్టూ లోకేష్ తిరగాల్సి వచ్చింది. ఢిల్లీలో కేంద్రమంత్రులను కలవడం, జరిగిన అన్యాయాన్ని వివరించడం.. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని వివరించే ప్రయత్నాలు చేయడం వంటివి చేశారు. అప్పట్లో తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద విరామం ఇచ్చి, 79 రోజుల తర్వాత నవంబర్ 27న మళ్లీ అక్కడినుంచే పాదయాత్ర కంటిన్యూ చేశారు లోకేష్. ఇప్పుడు యువగళాన్ని దిగ్విజయంగా ముగించారు.