PAC Meeting Key Decisions : హైదరాబాద్లోని గాంధీ భవన్లో పీఏసీ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది పీఏసీ. అలాగే.. తెలంగాణలో గ్రామ సభలు పెట్టి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. డిసెంబర్ 28 నుంచి 15 రోజుల పాటు గ్రామ సభలు ఉంటాయి.
పీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఏఐసీసీ సభ్యులు సంపత్ కుమార్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ మీడియాకు వివరించారు. గతంలో ఇందిరా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నామని చెప్పారు. అలాగే, సోనియా గాంధీ కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని అన్నారు.
వ్యవసాయం, ఆర్థిక, విద్యుత్ శాఖలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ చెప్పారు. మిషన్ భగీరథ అవకతవకలపైనా చర్చించామన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం రేపట్నుంచే మంత్రులు కార్యచరణ ప్రారంభిస్తున్నారని చెప్పారు.
టీపీసీసీ సమావేశంలో భాగంగా మూడు తీర్మానాలు చేశామని షబ్బీర్ తెలిపారు. తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియచేస్తూ మొదటి తీర్మానం చేయగా, సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, ఇతర నేతలకు ధన్యవాదాలు తెలుపుతూ రెండో తీర్మానం చేశామన్నారు. ఇక మూడో తీర్మానంలో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంట్ కు పోటి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్ కార్యకర్తల కష్టానికి తగిన గుర్తింపు ఉంటుందని ఏఐసీసీ నాయకులు సంపత్ కుమార్ అన్నారు. నామినేటెడ్ పదవుల్లో అర్హులందరికి అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే ఎంపిక ప్రక్రియపై చర్చించడం కూడా జరిగిందన్నారు. వీలైనంత ఎక్కువ మందికి న్యాయం జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని సంపత్ చెప్పారు.
తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా సోనియా గాంధీని ఆహ్వానిస్తున్నామన్నారు. 28న కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలకు నాగ్పూర్ కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తెలంగాణలో వంద రోజుల్లో 6 గ్యారెంటీ లు అమలు చేస్తామని ఆయన చెప్పారు. పీఏసీ సమావేశంలో మూడు తీర్మానాలు చేశామని, ఏకగ్రీవంగా ఆమోదం పొందాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
నామినేటెడ్ పోస్టులను పార్టీ నేతలకు త్వరలో ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని సంపత్ కుమార్ వివరించారు. పీఏసీ సమావేశంలో నామినేటెడ్ పోస్టులపై చర్చ జరిగిందని అన్నారు. లిస్టును ప్రిపేర్ చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు.