IPL Auction 2024 : దుబాయ్ లో జరిగే ఐపీఎల్ వేలం పాటకు సర్వం సిద్ధమైంది. 2024లో జరిగే లీగ్ కి సంబంధించి ప్లేయర్ల వేలానికి చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. అయితే ఇండియాలో జరిగే ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లకు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆడే దేశాల్లో మంచి పేరుంది. డబ్బులకు డబ్బు, హోదాకి హోదా, పేరుకి పేరు ఉండటంతో అందరూ అమితమైన ఆసక్తి చూపిస్తున్నారు.
ముఖ్యంగా విదేశీ జట్ల ఆటగాళ్లు ఐపీఎల్ పై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. డిసెంబర్ 19న మధ్యాహ్నం ఒంటిగంటకు వేలం జరగనుంది. అందులో వీరందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే ఎంతమంది ఆటగాళ్లు వేలంలో పాల్గొంటున్నారనే వివరాలను ఐపీఎల్ నిర్వాహకులు విడుదల చేశారు.
ఈసారి జరిగే మినీ వేలంలో మొత్తం 1166 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే ఐపీఎల్ నిర్వాహకులు, ప్రాంచైజీలు ఆసక్తి చూపించిన 333 మందితో కూడిన తుది జాబితాను విడుదల చేశారు. వీరిలో 119మంది విదేశీయులు ఉన్నారు. మిగిలిన 214 మంది స్వదేశీ ఆటగాళ్లు.
ఐపీఎల్ లో మొత్తం పది జట్లు పాల్గొంటున్నాయి. ఈ పది ప్రాంచైజీల్లో 77మంది ఆటగాళ్లకు మాత్రమే చోటు ఉంది. ఇప్పుడీ 333 మంది నుంచి ఎంపిక చేసుకుంటారు. వీరిలో మళ్లీ 30 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అవిపోగా భారతీయ ఆటగాళ్లు 47మందికే అవకాశం ఉంది. ఇప్పుడు వీరిలో ఎవరికి ఎక్కువ ధర పలుకుతుంది? ఎవరు తక్కువ ధరకు వెళతారనేది సర్వత్రా ఆసక్తికతరంగా మారింది.
ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు పది ఫ్రాంచైజీలు కలిపి రూ.262.95 కోట్లతో దుబాయ్ వెళుతున్నాయి. ఇందులో సన్ రైజర్స్ దగ్గర రూ.34 కోట్లు ఉన్నాయి. లఖ్ నవ్ సూపర్ జెయింట్స్ దగ్గర రూ.13.15 కోట్లు మాత్రమే ఉన్నాయి. అందరికన్నా ఎక్కువ గుజరాత్ టైటాన్స్ దగ్గర రూ. 38.15 కోట్లు ఉన్నాయి.
ట్రావిస్ హెడ్ , స్టార్క్ (ఆస్ట్రేలియా), డారెల్ మిచెల్, రచిన్ రవీంద్ర, జిమ్మీ నీషమ్ (న్యూజిలాండ్), కొయిట్టీ, వాండర్ డసెన్ (దక్షిణాఫ్రికా), అజ్మతుల్లా ఒమర్జాయ్ (ఆఫ్గనిస్తాన్), హసరంగ , మధుశంక (శ్రీలంక) వీరికి మంచి డిమాండ్ ఉన్నట్టుగా క్రీడా పండితులు పేర్కొంటున్నారు.
దక్షిణాఫ్రికాకు చెందిన 17 ఏళ్ల క్వేనా మఫాకా చిన్నవయస్కుడిగా ఉన్నాడు. మహ్మద్ నబీ (38) ఆఫ్గాన్ ఆటగాడు పెద్ద వయస్కుడిగా ఉన్నాడు.
ఈ వేలం పాటను లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నారు. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, జియో సినిమా ఓటీటీల్లో వీక్షించవచ్చునని ఐపీఎల్ వేలం పాట నిర్వహకులు తెలిపారు.