Telangana Congress : తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజయంతో అధికార పగ్గాలు చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ సమరంపై దృష్టిపెట్టింది. పార్లమెంట్ ఎన్నికలకు ఇంఛార్జులను నియమించింది. సీఎం సహా మంత్రులకు ఈ బాధ్యతలు ఇచ్చింది. 17 పార్లమెంట్ స్ధానాలకు అబ్జర్వర్లను కూడా నియమించింది.
సీఎం, డిప్యూటీ సీఎంకు చెరో రెండు పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించింది. సీఎం రేవంత్రెడ్డికి చేవెళ్ల, మహబూబ్నగర్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆదిలాబాద్, మహబూబాబాద్ జిల్లాల బాధ్యతలు ఇచ్చింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఖమ్మం, ఉత్తమ్కుమార్ రెడ్డికి నల్లగొండ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి భువనగిరి, పొన్నం ప్రభాకర్ కు కరీంనగర్ పార్లమెంట్ స్థానం బాధ్యతలు అప్పగించింది.
మరోవైపు పలువురు నేతలు ఎంపీగా తమ అభ్యర్థిత్వాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్లో ఆశావహులు లోక్సభ స్థానాల్లో పోటీపై గురిపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టడంతో అనుకూలంగా ఉన్న స్థానాల్లో పోటీ కూడా పెరిగింది. అయితే ఆదిలాబాద్, హైదరాబాద్, చేవేళ్ల లోక్సభ స్థానాల్లో పోటీ తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, మిగిలిన స్థానాల్లో బరిగిలో దిగేందుకు నేతలు పెద్దసంఖ్యలో సిద్ధమవుతున్నారు.
పెద్దపల్లి నుంచి వివేక్ కుమారుడు, కరీంనగర్ నుంచి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, ప్రవీణ్ రెడ్డి, నిజామాబాద్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన జీవన్రెడ్డి పోటీకి ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ సురేశ్ షెట్కర్, మెదక్ నుంచి మాజీ ఎంపీ విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మల్కాజ్గిరి నుంచి హరివర్ధన్రెడ్డిలు పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.