Uttam Kumar Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ పనులు చేసిన ఎల్ అండ్ టి ఏజెన్సీ ప్రతినిధులతో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఎల్ అండ్ టి గ్రూప్ డైరెక్టర్ ఎస్. వి దేశాయ్ పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. ఎల్. అండ్ టి ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. అంత పెద్ద ప్రాజెక్ట్ లో నాసిరకం పనులు ఎలా చేశారని అసహనం వ్యక్తం చేశారు.
ఇంత బాధ్యతా రాహిత్యంగా బ్యారేజ్ పనులు ఎలా చేశారని నిలదీశారు. ప్రజా ధనాన్ని ఎలా దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి తమ ప్రమేయం లేదు అని తప్పించుకోవాలంటే ఊరుకోమని హెచ్చరించారు. ప్రజా ధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవ్వరినీ వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు .
మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించిన పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలన్నారు ఆయన. తప్పు చేసిన వారు తప్పించుకోవాలని చూస్తే న్యాయ పరంగా, చట్ట పరంగా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి హెచ్చరించారు.