Semi Final : T20 వరల్డ్ కప్ లో సూపర్-12 మ్యాచ్ లు అనూహ్య మలుపులు తిరుగుతూ… సెమీస్ బెర్త్ లపై రోజురోజుకూ ఉత్కంఠను పెంచుతున్నాయి. పాకిస్థాన్ తో మ్యాచ్ లో ఫేవరెట్ గా బరిలోకి దిగిన సౌతాఫ్రికా… అనూహ్యంగా చతికిలబడటంతో… బాబర్ సేన సెమీఫైనల్ అవకాశాల్ని నిలబెట్టుకుంది. అయితే… జింబాబ్వే చేతిలో ఇండియా, నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోయి… బంగ్లాదేశ్ పై పాక్ భారీ తేడాతో గెలిచి రన్ రేట్ ను మెరుగుపరుచుకుంటేనే… ఆ జట్టుకు సెమీస్ చేరే అవకాశాలు ఉంటాయి.
టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్.. 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. దాంతో ఆ జట్టు 120 రన్స్ అయినా చేస్తుందా? అని అనిపించింది. కానీ… మిడిలార్డర్ బ్యాటర్లు ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ చెలరేగి ఆడటంతో… పాక్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఇఫ్తికార్ 35 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 రన్స్ చేయగా… షాదాబ్ ఖాన్ 22 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 రన్స్ చేశాడు. చివర్లో పాక్ 3 వరుస బంతుల్లో 3 వికెట్లు కోల్పోయినా… అప్పటికే స్కోరు భారీగా ఉండటం, ఇక ఐదు బంతులే మిగిలి ఉండటంతో… పెద్దగా ఒత్తిడి పడలేదు. టెయిలెండర్లు చివరి 5 బంతుల్లో 8 రన్స్ చేయడంతో… 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోర్ చేసింది… పాకిస్థాన్.
186 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా… తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ డికాక్ డకౌటయ్యాడు. ఈ వరల్డ్ కప్ లో సెంచరీ చేసిన రూసో కూడా మూడో ఓవర్లోనే తక్కువ స్కోరుకు వెనుదిరిగాడు. కెప్టెన్ బవుమా, మార్ క్రమ్ కాసేపు పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. మూడో వికెట్ కు 49 రన్స్ జోడించారు. అయితే 8వ ఓవర్లో ఇద్దరూ ఔట్ కావడంతో… 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది… సౌతాఫ్రికా. 9వ ఓవర్ దగ్గర వర్షం పడటంతో మ్యాచ్ దాదాపు అరగంట ఆగిపోయింది. వాన వెలిశాక… డక్వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్ను 14 ఓవర్లకు కుదించి దక్షిణాఫ్రికా ముందు 142 పరుగుల లక్ష్యాన్ని పెట్టారు. దాంతో… సౌతాఫ్రికా గెలవాలంటే 5 ఓవర్లలో 73 పరుగులు చేయాల్సి వచ్చింది. క్లాసెన్, స్టబ్స్ కాసేపు పోరాడినా… ధాటిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. దాంతో… 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు మాత్రమే చేసిన సౌతాఫ్రికా… 33 పరుగుల తేడాతో ఓడిపోయింది. హాఫ్ సెంచరీతో పాటు 2 వికెట్లు తీసిన షాదాబ్ ఖాన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.