CM Jagan : దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సంబంధిత శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైద్యం కోసం అయ్యే ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధి కిందకు వస్తుందని సీఎం పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏ పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలు కాకూడదని అడుగులు వేస్తున్నామని ఆయన తెలిపారు.పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పేదలకు ఆరోగ్యశ్రీ ఒక వరమని ఆయన తెలిపారు.
ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్యను పెంచామని.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2,513 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 4 కోట్ల 25 లక్షల మంది ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారని సీఎం అన్నారు. ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ.4,100 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.
ఇక నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రతి స్మార్ట్ కార్డు మీద క్యూఆర్ కోడ్, లబ్ధిదారుని ఫొటో, ఇతర వివరాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ సేవలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించాలని సీఎం తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవల్ని ప్రతీ ఒక్కరికీ విస్తరించాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. ఆరోగ్య శ్రీ లో చేపట్టిన మార్పులు విప్లవాత్మకమైన మార్పులని సీఎం తెలిపారు.
గతంలో రూ.5 లక్షలకు మించి ఇవ్వలేదని సీఎం జగన్ గుర్తుచేశారు. ఇక నుంచి ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలు నిర్మాణం జరుగుతుందని.. ప్రతి పార్లమెంట్ స్థానానికి ఒక మెడికల్ కాలేజీ ఉండేలా ప్రణాళిక రూపొందించామని సీఎం జగన్ స్పష్టం చేశారు.
.
.