Japan : ముదిమి ముప్పుతో జపాన్ సతమతమవుతోంది. అక్కడి జనాభాలో ప్రతి పదిమందిలో ఒకరు 80 ఏళ్లు పైబడినవారే. ముసలితనంతో బాధపడుతున్న వారే. 125 మిలియన్ల జనాభాలో 65 ఏళ్లు, ఆపై వయసు ఉన్న వారు 29.1 శాతమని జపాన్ జనాభా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జననాల రేటు అతి తక్కువగా ఉండటం వల్ల వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది.
ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం వయోవృద్ధులు అత్యధికంగా ఉన్న దేశం జపానే. ముసలివాళ్లు ఎక్కువగా ఉన్న దేశాలుగా ఇటలీ(24.5%), ఫిన్లాండ్(23.6%) 2, 3 స్థానాల్లో నిలిచాయి. 2040 నాటికి జపాన్లో 65 ఏళ్లు, ఆపైబడిన జనాభా 34.8 శాతానికి చేరుకుంటుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాప్యులేషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ రిసెర్చి లెక్కగట్టింది.
జననాల రేటు మందగించి.. వృద్ధుల శాతం ఇబ్బడిముబ్బడి కావడం ఏ దేశానికైనా మంచిది కాదు. దాని వల్ల పనిచేసే వారి సంఖ్య తగ్గిపోతుంది. ఉత్పత్తి కుంటుపడుతుంది. చిట్టచివరకు దేశం ఆర్థికంగా కుదేలు కావడం ఖాయం. రానున్న ఈ ముప్పును జపాన్ గ్రహించింది. అందుకే పెద్ద ఎత్తున వలస కార్మికులను తమ దేశంలోకి ఆహ్వానిస్తోంది.
రానున్న ఐదేళ్లలో వీరి సంఖ్యను నాలుగింతలు చేయనుంది. ఈ లెక్కన ఏకంగా లక్ష మంది వలస కార్మికులకు రెడ్ కార్పెట్ పరిచే వీలుంది. ఏజింగ్ పాప్యులేషన్ కారణంగా కార్మికుల కొరతను అధిగమించేందుకు నాలుగేళ్ల క్రితమే స్పెసిఫైడ్ స్కిల్డ్ వర్కర్స్(SSW) ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టింది.
2040 వరకు తన ఆర్థిక సుస్థిరాభివృద్ధిని కొనసాగించేందుకు జపాన్కు 67 లక్షల మందికిపైగా విదేశీ కార్మికుల అవసరం పడుతుంది. ఈ కారణంగానే రానున్న ఐదేళ్లలో ఇండొనేసియా నుంచి లక్ష మంది కార్మికులకు రెడ్ కార్పెట్ పరిచేందుకు సిద్ధమైంది. ఇండొనేసియాలో 70% జనాభా 17-64 ఏళ్ల లోపు వయసున్నవారే. అక్కడ నిరుద్యోగిత రేటు 5.32కి చేరింది. పనిచేయగల చేవ ఉండీ.. ఉపాధి లేని వారు 78.6 లక్షల మంది వరకు ఉన్నారు.
1958 నుంచీ ఈ రెండు దేశాల మధ్య చెలిమి, సహకారం కొనసాగుతోంది. ‘డెమొగ్రాఫిక్ డివిడెండ్’ కారణంగా ఇప్పుడు ఇరుదేశాలు లబ్ధి పొందనున్నాయి. జపాన్లో ఉపాధి పొందడం ద్వారా ఇండొనేసియా నిరుద్యోగ సమస్య నుంచి బయటపడగలుగుతుంది. SSW స్కీం కింద నిరుడు రికార్డు స్థాయిలో 12,438 మంది జపాన్లో ఉపాధి పొందారు. ఒక ఏడాదిలో ఉపాధి పొందిన విదేశీ కార్మికుల్లో ఇప్పటి వరకు ఇదే గరిష్ఠసంఖ్య.