Red sandalwood smuggling : చిత్తూరు జిల్లాలో టాస్క్ ఫోర్స్ అధికారులు ఎర్రచందనం స్మగ్లర్ల పై దాడులు చేశారు. సత్యవేడు మండలం ఇందిరా నగర్ సమీపంలో ఓ ప్రైవేటు లైసెన్స్ ఎర్రచందనం గోడౌన్ లో తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు ఎర్రచందనం దొంగలించారు.
లారీలో వేసుకొని వెళ్తుండగా టాస్క్ ఫోర్స్ అధికారులు వారిని వెంబడించి పట్టుకున్నారు. నాలుగు టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. 16 మంది స్మగ్లర్లను అదుపులో తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
అందులో తమిళనాడుకు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నాడు. స్మగ్లర్లు ఎర్రచందనం గోడౌన్ కాపలాదారులను బెదిరించి వారిని కట్టివేసి దొంగతనానికి పాల్పడ్డారు . తమిళనాడుకు చెందిన ఎర్రచందనం దొంగలు ఈ గోడౌన్ పై దాడులు చేస్తారని టాస్క్ ఫోర్స్ అధికారులకు ముందుగానే సమాచారం అందిందన్నారు.
టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారం రోజులుగా నిఘా పెట్టినట్లు తెలిపారు. ఈ దాడుల్లో దాదాపు 30 మంది టాస్క్ ఫోర్స్ అధికారులు పాల్గొన్నారు. టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ కేసును స్థానిక పోలీసులకు అప్పగించామన్నారు. సత్యవేడుకు చెందిన స్థానిక పోలీస్ అధికారులు కూడా ఈ దాడుల్లో పాల్గొన్నారని తెలిపారు.