Jagityal: వ్యక్తి చనిపోయాడని.. ఓ వైపు అతని కుటుంబ సభ్యులు అంతా విలపిస్తూ ఉంటే.. మరో వైపు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతుండగా.. అప్పుల వాళ్ళు ఎంట్రీ ఇచ్చి.. డబ్బులు కట్టే వరకు తలకొరివి పెట్టడానికి వీల్లేదు అని చెప్పడం.. ఈ తరహా ఘటనలు ఎప్పుడూ సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ ఇప్పుడు అదే ఘటన రియల్ లైఫ్ లో కూడా జరిగింది. కొడుకు అప్పు కట్టలేదని అప్పులోళ్లు తండ్రి దహన సంస్కారాల్ని అడ్డుకున్న సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
మెట్పల్లి పట్టణంలోని చైతన్యనగర్లో పుల్లూరి శ్రీకాంత్ అనే వ్యక్తి కోటి 70 లక్షల రూపాయలు అప్పు చేసి.. కొన్ని సంవత్సరాల క్రితమే హైదరాబాద్ వెళ్లిపోయాడు. అయితే అతని తండ్రి.. నారాయణ శనివారం మృతి చెందడంతో స్వస్థలానికి తిరిగి వచ్చాడు. కాగా శ్రీకాంత్ వచ్చిన విషయం తెలుసుకున్న.. అప్పులోళ్లు.. అతని ఇంటికి వెళ్లి.. తండ్రి దహన సంస్కారాల్ని అడ్డుకున్నారు. భూమి, ఇళ్లు అమ్మి అయినా సరే అప్పు కడతానని శ్రీకాంత్ హామీ ఇవ్వడంతో.. వారు వెళ్లిపోయారు. గతంలో తల్లి మృతి చెందినప్పుడు కూడా.. ఇలా చెప్పి తప్పించుకోవడంతోనే.. అంత్యక్రియలు అడ్డుకున్నామని అప్పు ఇచ్చిన వాళ్ళు చెబుతున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.