YS Jagan : ఏపీలో సీఎం జగన్ క్లీన్ స్వీప్ దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. 175 సీట్లే టార్గెట్గా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు గెలుపు గుర్రాల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సెకండ్ లిస్ట్ కూడా సిద్ధం అయినట్టు తెలుస్తుండటంతో వైసీపీ నేతలు టెన్షన్లో ఉన్నారు. జగన్ మదిలో ఉన్నదెవరో..? అభ్యర్థుల లిస్టు నుంచి తప్పించింది ఎవరినో అనే ఆందోళనలో ఉన్నారు.
ఏపీ సీఎం జగన్ వైనాట్ 175 అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే మార్పులు చేర్పులపై దృష్టి సారించారు. కుప్పుం నుంచి ఇచ్చాపురం వరకూ మార్పులే చేస్తున్నారు. కొందరిని తొలగిస్తూ మరికొందరిని మారుస్తుంటంతో బదిలీ కారణాలేంటో తెలియక వైసీపీ అధినేత తీరుతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు అధికార పార్టీ నేతలు.
ఇటీవల మార్చిన 11 నియోజకవర్గాల్లో మార్పులు తథ్యమన్న మాట కూడా వినిపిస్తోంది. మరోపక్క ఉభయ గోదావరి జిల్లాల్లో అభ్యర్థుల మార్పు కాకరేపుతోంది. ఏపీ మార్పుల గురించి కర్ణాటక ఎంపీ గెస్ట్ హౌస్లో ఎమ్మెల్యేలు మంతనాలు జరుపుతూ.. మీరైనా సీఎంకి చెప్పండంటూ ఎంపీకి సూచనలు చేస్తున్నట్టు సమాచారం. అలాగే సీఎం సన్నిహితుల నుంచి కూడా ముఖ్యమంత్రికి ఆశావహుల వరుస కాల్స్ వస్తుండటంతోపాటు.. వైసీపీ ఎమ్మెల్యేలకి టికెట్స్ కోసం పక్క రాష్ట్రాల నుంచి సిఫార్సులు చేస్తుండటం ఏపీ ఎన్నికల రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికల బరిలో వారసులకు కూడా అవకాశం కల్పిస్తున్నట్టు తెలుస్తోంది. గెలుపు గుర్రాల లిస్టులో వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వారసులు ఉన్నట్టు సమాచారం. ఇక ఇటీవల సర్వేలతో జగన్ మార్పులు, చేర్పులపై ఫోకస్ పెట్టడంతో ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మరోసారి సర్వేలు నిర్వహిస్తోంది వైసీపీ అధిష్టానం.