Viveka Murder Case: మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. సీబీఐ ఏఎస్పీ రామ్సింగ్తో పాటు.. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్రెడ్డిపై.. పులివెందుల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వివేక PA కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు..పులివెందుల అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండ్రోజుల క్రితం పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్టు సమాచారం. వివేకానంద హత్య కేసులో సీబీఐ దర్యాప్తు అధికారి.. రామ్సింగ్ తనను బెదిరించారని కృష్ణారెడ్డి చెబుతున్నాడు. వివేకా హత్యకేసులో తప్పుడు సాక్ష్యాలు చెప్పాలని రామ్ సింగ్ బెదిరించారని.. కృష్ణారెడ్డి తన కంప్లైట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
సీబీఐ అధికారులు కోరిన విధంగా సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి కూడా తనపై ఒత్తిడి తీసుకొచ్చారని పీఏ కృష్ణారెడ్డి ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని అప్పట్లోనే ఎస్పీగా ఉన్న అన్బురాజన్ ను కలిసి వినపత్రాన్ని అందజేశారు. రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా ప్రయోజనం లేకపోవడంతో.. కోర్టును ఆశ్రయించాల్సి వచ్చినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. కృష్ణారెడ్డి పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు.. సునీత, రాజశేఖరరెడ్డి, రాంసింగ్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 156 (3) కింద పులివెందుల పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. డిసెంబర్ 15న ఈ ముగ్గురిపై పులివెందుల పీఎస్ లో కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు.