Dalitha Bandhu Scam: మెదక్ జిల్లాలో దళిత బంధు లబ్ధిదారుల నుంచి బీఆర్ఎస్ నేతలు డబ్బులు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. టేక్మాల్ మండలంలోని పల్వంచ గ్రామానికి చెందిన జంగిడిగళ్ళ భూమయ్యతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు దళిత బంధు రెండో విడతలో భాగంగా లిస్టులో తమ పేర్లు వచ్చాయని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కు కృతజ్ఞతలు చెప్పేందుకు క్యాంపు ఆఫీసుకు వెళ్లారు.
ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే సోదరుడు రాహుల్ కిరణ్.. వారి వద్ద నుంచి ఒక్కో వ్యక్తి దగ్గర మూడు లక్షల చొప్పున మొత్తం 12 లక్షలు వసూలు చేశారు. అయితే ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో బాధితులు తమ డబ్బు తిరిగి చెల్లించాలని రాహుల్ ను వేడుకోవడంతో దళిత బంధు కథ అడ్డం తిరిగింది. డబ్బులు ఎవరికి ఇచ్చావు అంటూ బాధితునికి దబాయించే ప్రయత్నం చేశారు రాహుల్ కిరణ్.
అంతేకాకుండా ఫోన్ కాల్ లో నోటికి వచ్చినట్లు బాధితున్ని బూతు పురాణాలతో తిట్టడమే కాకుండా.. ఇంటికి వచ్చి లేపేస్తా అంటూ బాధితుడిని బెదిరించసాగాడు బిఆర్ఎస్ నాయకుడు. దాంతో దళిత బంధు పేరిట ఒక్కొక్కరి దగ్గర 3 లక్షల రూపాయల చొప్పున మొత్తం 12 లక్షలు వసూలు చేశారని బాధితుడు భూమయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాను చెల్లించిన డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.