IND vs SA : సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్కు ఆదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చింది టీమ్ ఇండియా. 116 పరుగులకే సౌతాఫ్రికాను ఆలౌట్ చేసిన టీమ్ ఇండియా.. 117 పరుగుల టార్గెట్ను కేవలం 16 ఓవర్లలోనే చేధించింది. రుత్రాజ్ గైక్వాడ్ ఐదు పరుగులకే పెవిలియన్ చేరినా.. సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో టీమ్ ఇండియా విక్టరీ నల్లేరుపై నడకలా మారింది. చివర్లో శ్రేయస్ అయ్యర్ అవుట్ అవ్వడంతో తిలక్ వర్మ విన్నింగ్ షాట్తో మ్యాచ్ను ముగించాడు.
అంతకుముందు టీమ్ ఇండియా బౌలర్లు చెలరేగారు. సౌతాఫ్రికా బ్యాట్స్మెన్ వెన్ను విరుస్తూ 116 పరుగులకే ఆలౌట్ చేశారు. వికెట్ల వేటలో ఫాస్ట్ బౌలర్లు అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ పోటీ పడ్డారనే చెప్పాలి. వీరిద్దరి ధాటికి 58 పరుగులకే సౌతాఫ్రికా టీమ్ ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయింది. హెండ్రిక్స్, డసెన్ ముల్డర్ ఖాతా తెరవకముందే పెవిలియన్కు చేరారు. మొత్తంగా అర్షదీప్ ఐదు వికెట్లు, అవేష్ ఖాన్ నాలుగు, వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశారు.
అయితే ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా హ్యాట్రిక్ వికెట్లు తీసిందనే చెప్పాలి. పదో ఓవర్ ఆఖరి బంతికి క్లాసెన్ను అర్షదీప్ క్లీన్బౌల్డ్ చేయగా.. తర్వాత ఓవర్ తొలి రెండు బంతులకు అవేశ్ ఖాన్ వరుసగా రెండు వికెట్లు సాధించాడు. దీంతో టీమిండియా వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి టీం హ్యాట్రిక్ నమోదుచేసింది.
ఈ మ్యాచ్లో వికెట్ల వేటను అర్షదీప్ మొదలుపెట్టాడు. రెండో ఓవర్లో వరుస బంతుల్లో కీలక రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు. హెండ్రిక్స్ను క్లీన్బౌల్డ్ చేసిన అర్షదీప్ తర్వాతి బంతికే డసెన్ను పెవిలియన్కు పంపాడు.
ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా పింక్ జెర్సీతో బరిలోకి దిగింది. బ్రెస్ట్ కాన్సర్ అవగాహన కోసం సఫారీ సేన పింక్ జెర్సీని ధరించింది. మరోవైపు భారత యువ ప్లేయర్ సాయి సుదర్శన్ ఇవాళ మ్యాచ్తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు.