Kurnool Gold Mines : రాయలసీమకు ఇక పూర్వవైభవం రానుంది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో బంగారు నిక్షేపాలున్నాయని జియోలాజికల్ సర్వే గుర్తించింది. ప్రస్తుతం గనుల నాణ్యత, విస్తీర్ణం అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇటీవల విజయవాడలో జరిగిన జీఎస్ఐ రాష్ట్ర బోర్డు సమావేశంలో ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు జీఎస్ఐ బృందాన్ని కోరారు.
త్వరలో మరో మారు ఆస్పరి మండలంలో జీఎస్ఐ బృందాలు పర్యటించే అవకాశం ఉంది. ఇప్పటికే తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాలు దొరుకుతుంటే.. పగిడిరాయిలో గనుల నుంచి పసిడిని వెలికి తీస్తున్నారు. ఇలాంటి సమయంలో అస్పరిలో బంగారు నిక్షేపాలు ఉన్నయన్న విషయాన్ని జీఎస్ఐ బృందం బయటపెట్టడంతో ఆ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోల్డ్ మైన్స్తోనైనా తమ జీవితాలు మారతాయంటున్నారు ఆస్పరి గ్రామస్థులు.
తుగ్గలి, మద్దికెర ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు ఉన్న విషయాన్ని 1994లోనే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. గనుల తవ్వకాల్లోకి విదేశీ పెట్టుబడులను భారత ప్రభుత్వం అనుమతించిన తర్వాత, 2005లోనే జియో మోసూర్ సంస్థ జొన్నగిరి సమీపంలో బంగారు గని నిర్వహణకు దరఖాస్తు చేసుకుంది. 2013లో ఈ సంస్థకు బంగారం వెలికితీతకు అనుమతులొచ్చాయి.
బంగారు నిక్షేపాలు ఉన్న 350 ఎకరాలను కొనుగోలు చేసిన ఆసంస్థ, మరో 1500 ఎకరాలను లీజుకు కూడా తీసుకుంది. భూమిని లీజుకు ఇచ్చిన రైతులకు ఏటా కౌలు చెల్లిస్తోంది. బంగారం తవ్వకాల కోసం ఈసంస్థ ఇప్పటికే 100 కోట్లకుపైగా ఖర్చు చేసింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా 1500 ఎకరాల్లో ప్రతి 20 మీటర్లకు ఒకటి చొప్పున 30 వేల మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేపట్టింది. పైలట్ ప్రాజెక్టులో ఫలితాలు అంచనాలకు అనుగుణంగా రావడంతో పూర్తి స్థాయిలో ఈ సంస్థ మైనింగ్ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది.