Naga Babu : రాజకీయ పదవులపై తనకు ఆసక్తి లేదని, వచ్చే ఎన్నికలలో ఎంపీగా పోటీ చేస్తున్నాననే విషయంలో నిజం లేదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పష్టం చేశారు. అక్రమ గ్రావెల్ పై సోమిరెడ్డి చేస్తున్న పోరాట దీక్షకు సమయం లేనందున వెళ్ళలేకపోతున్నాని తెలిపారు. తనకు ఫిల్మ్ నగర్ లో ఓటు ఉందని, మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో తనతో పాటు తన కుటుంబ సభ్యులెవరూ ఓటు వేయ్యలేదని తెలిపారు.
“మంగళగిరికి వచ్చేయడంతో నేను నా కుటుంబ సభ్యులు ఓటు హక్కు మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నాం. నా ఓటుని తెలంగాణలో రద్దు చేసుకున్నాను. తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ లో రెండుచోట్ల ఓట్లు ఉన్నాయన్న ఆరోపణలు అవాస్తవం” అని నాగబాబు తెలిపారు. వచ్చే ఎన్నికలలో టిడీపీ, జనసేన కి ఓటు వేస్తానని అన్నారు. పార్టీలో విభేధాలు ఉండటం సర్వసాధారణ అంశమని.. త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో జనసేనపార్టీ నుంచి మా అభ్యర్థి పోటి చేస్తారని తెలిపారు.
నిజమైన నాయకుడు ఎవ్వరూ ప్రతిపక్షం ఉండకూడదు అనే ఆలోచనతో ఉండరని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వై నాట్ 175 అంటున్నారని.. వై నాట్ వైసీపీ జీరో అని తాము అంటున్నామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ పార్టీకి 20 నుంచి 25 సీట్లు రావని.. వారు ప్రతిపక్షంలో ఉంటారని తెలిపారు.