LIBYA Boat Accident : యుద్ధాలు.. పేదరికం.. ఆకలి.. వీటి నుంచి తప్పించుకోవాలనుకున్న ఆ వలసదారుల బతుకులు సముద్రం పాలయ్యాయి. ఉత్తర ఆఫ్రియా దేశమైన లిబియా తీరంలో పడవ మునిగి ఏకంగా 61 మంది మృతి చెందారు. వీరంతా లిబియా తీరంలోని జువారా నుంచి బయలుదేరి యూరప్ తీరానికి చేరుకోవాలనుకున్నారు. కానీ భయంకరమైన అలల తాకిడికి తట్టుకోలేక పడవ నీటిలో మునిగి వలసదారులు మరణించారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపింది.
వీరంతా నైజీరియా, జాంబియాతో పాటు ఇతర ఆఫ్రికన్ దేశాలకు చెందిన మహిళలు, పిల్లలు సహా మొత్తం 86 మంది వలసదారులు ప్రమాద సమయంలో ఆ బోటులో ఉన్నట్టు తెలిపింది. మిగిలిన 25 మందిని రక్షించిన కోస్ట్ గార్డ్స్ లిబియా డిటెన్షన్ సెంటర్కి తరలించినట్లు IOM తెలిపింది.
ప్రాణాలతో బయటపడిన వారందరూ సురక్షితంగా ఉన్నారని IOM తెలిపింది. లిబియా, ట్యునీషియా ఇటలీ మీదుగా యూరప్కు చేరుకోవాలని వలసదారులు ప్లాన్ చేశారు. ఈ ఏడాది ట్యునీషియా, లిబియా నుంచి లక్షా 53 వేల మంది కంటే ఎక్కువ వలసదారులు ఇటలీకి చేరుకున్నారు. అయితే 2 వేల మందికి పైగా అనేక ప్రమాదాల కారణంగా మృతి చెందారు.