NRI Mahendra: ఆ యువకుడు అందరూ నడిచే దారిలో తానూ నడవొద్దనుకున్నాడు. దానికోసం తమ చదువు, అమెరికా ఉద్యోగాన్నీ పక్కనబెట్టి పర్యావరణాన్ని కాపాడే ఉత్పత్తులను తయారు చేద్దాం అనుకున్నాడు. అంతేకాదు.. అందులో సక్సెస్ సాధించి.. ఇప్పుడు మరెందరికో ఉద్యోగాలిస్తూ.. మంచి లాభాలను, గుర్తింపునూ పొందుతున్నాడు. ఎవరీ కుర్రాడు? అతని బిజినెస్ ఆలోచన ఏంటో మనమూ తెలుసుకుందాం.
ప్లాస్టిక్ వద్దనుకుని..
శనగాల మహేంద్ర. ప్రకాశం జిల్లా కొణిజేడు గ్రామవాసి. అమెరికా వెళ్లి.. డేటాసైన్స్లో మాస్టర్స్ చేసి, ఆరేళ్లు సైబర్ సెక్యూరిటీ సంస్థలో ఉద్యోగం చేశాడు. ఒకరోజు ఆఫీసులో కూల్డ్రింక్తో బాటు ఇచ్చిన కంపోస్టబుల్స్ట్రా చూసి, ‘మన ఊళ్లో.. మనమే వీటిని తయారు చేస్తే పోలా..’ అనుకున్నాడు. పర్యావరణ పరిరక్షణలో తనవంతు బాధ్యత తీసుకోవాలనుకుని, జర్మనీలో మొక్కజొన్న నుంచి పర్యావరణహిత సంచులు తయారు చేసే ప్రక్రియ గురించి రీసెర్చ్ చేశాడు. సీన్ కట్ చేస్తే.. మార్చి 28, 2019న ‘ఈట్లరీ’ పేరుతో ఇండియా వచ్చి.. స్టార్టప్ ప్రారంభించాడు
మొదట ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా.. మొక్కజొన్న ఫైబర్తో చేసిన సంచులు చేసేవారు. క్రమంగా బ్రష్లు, ప్లేట్లు, స్పూన్లు, స్ట్రాలు తయారు చేస్తున్నాడు. నెలకు 2 టన్నుల ఉత్పత్తితో ప్రారంభించి.. నేడు 20 టన్నుల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. మొదట్లో రూ.40 లక్షల నష్టం వచ్చింది గానీ ఆ టైంలోనే ఏపీ ప్రభుత్వం ప్లాస్టిక్ను నిషేధించటంతో ఈ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది.
రైతుల నుంచే మొక్కజొన్నలు కొనటంతో బాటు.. అరటి బోదెతో స్పూన్లు, ప్లేట్లు, వెదురుతో బ్రష్లూ చేసి అమ్మటంతో వ్యాపారం గాడిన పడింది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా పలువురు వీరి క్లయింట్ల జాబితాలో చేరారు.