Yuvagalam: ఈ నెల 20న యువగళం పాదయాత్ర ముగింపునకు విజయనగరం జిల్లా భోగాపురంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు స్వాగతం పలుకుతున్నారన్నారు . రాష్ట్రంలో నియంతృత్వానికి వ్యతిరేకంగా యువకులు కదిలారన్నారు.
అబద్దపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన జగన్ పాలనను అంతం చేసేందుకు లక్షలాది మంది ప్రజలు సన్నద్దం అయ్యారన్నారు. అందుకే నవ్యాంధ్రను పరిరక్షించుకునేందుకై చేసే ఈ యాత్రకు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు కన్నీళ్లు, కష్టాలతోనే ఉన్నారన్నారు. జగన్ ఇచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్కటి నెరవేర్చకుండా కేవలం ప్రతిపక్షాల మీద దాడి చేయడంతోనే బిజీ అయ్యారన్నారు.
గత నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజలను పట్టించుకోని జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం జనాల్లోకి వస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని ఎండగట్టేందుకే నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేపట్టారన్నారు. ఈ యాత్ర ద్వారా లోకేష్ ప్రజల కష్టాలను తెలుసుకున్నారన్నారు.
నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు హైదరాబాద్ నుంచి సైతం ఐటీ ఉద్యోగులు భారీగా చేరుకుంటున్నారు.
యువగళం ముగింపు ఏర్పాట్లలో భాగస్వామ్యం అవుతున్నారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి చంద్రబాబు ఎంతో మంది జీవితాలకు వెలుగునిచ్చారన్నారు. లోకేష్ కూడా ఐటీ మంత్రిగా యువతకు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారని అందుకే ఐటీ వింగ్ తరపున పాదయాత్రలో పాల్గొంటున్నామని చెప్తున్నారు.
విశాఖ జిల్లాలోకి పాదయాత్ర చేరుకుంటున్న నేపథ్యంలో టీడీపీ, జనసేన నాయకులు లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. ముగింపు సభకు భారీగా జనసేన కార్యకర్తలు తరలివస్తారని జనసేన నాయకులు పంచకర్ల రమేష్ తెలిపారు.