konda surekha: రాష్ట్ర అటవీ,పర్యావరణశాఖ మరియు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అటవీ శాఖ కార్యకలాపాల మీద సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీ సంరక్షణ అధికారి అటవీశాఖ ద్వారా అమలు అవుతున్న పథకాలు, పనులపై ప్రజంటెషన్ ఇచ్చారు.
ప్రస్తుతం అటవీ ,దేవాదాయ శాఖలో ఉన్న ఉద్యోగ ఖాళీల వివరాలు తెలుసుకున్నారు. జంతువుల దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చే ఎక్స్ గ్రేషియాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచుతూ తొలి సంతకం చేశారు. ఇతర రాష్ట్రాల నుండి ఏనుగులను తెలంగాణలోకి తెచ్చుకునేందుకు అనుమతిస్తూ మరో సంతకం చేశారు.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమెను బాసర జ్ఞాన సరస్వతి దేవస్థాన అర్చక వైదిక బృందం, ఆలయ అధికారులు కలిశారు. మంత్రిగా బాధ్యతల స్వీకరణ సందర్భంగా మంత్రోచ్ఛరణలతో ఆశీర్వదించారు. అమ్మవారి చిత్ర పటాన్ని బహుకరించారు. వసంత పంచమి పురస్కరించుకొని ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామని మంత్రి సురేఖ తెలిపారు.