Gang Assault: దేశ రాజధాని ఢిల్లీలో 2012లో జరిగిన నిర్భయ ఘటనను తలచుకుంటే.. ఇప్పటికీ ఎవరికైనా కోపం కట్టలు తెంచుకుంటుంది. తాజాగా అలాంటి ఘటనే రాజస్థాన్ లో జరిగింది. కదులుతున్న బస్సులో బాలికపై ఇద్దరు డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. డిసెంబర్ 9వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగినట్లు బస్సీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పూల్ చంద్ మీనా మీడియాకు తెలిపారు.
ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్ నుంచి జైపూర్ లో ఉన్న తన మామయ్య ఇంటికి వెళ్లేందుకు డిసెంబర్ 9వ తేదీ రాత్రి 7.30 గంటల సమయంలో బాలిక బస్సు ఎక్కింది. కూర్చునేందుకు సీట్లు ఖాళీ లేకపోవడంతో.. బస్సు క్యాబిన్ లో కూర్చోవాలని డ్రైవర్ చెప్పాడు. కొంతదూరం వెళ్లేసరికి బస్సులోని కొందరు ప్రయాణికులు తమ గమ్యస్థానాల్లో దిగిపోయారు. అనంతరం బాలికపై డ్రైవర్లు ఇద్దరూ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరి తర్వాత ఒకరు బాలికపై అత్యాచారం చేసినట్లు ఏసీపీ ఫూల్ చంద్ మీనా వెల్లడించారు.
బస్సులో మిగతా ప్రయాణికులకు ఏదో అనుమానం వచ్చి.. క్యాబిన్ డోర్ తెరవడంతో ఈ దారుణం వెలుగుచూసింది. బాలిక పరిస్థితిని గుర్తించిన ప్రయాణికులు.. డ్రైవర్లను చితకబాదారు. వారిలో ఒకరు పరారవ్వగా.. మరొకరిని ప్రయాణికులు పట్టుకుని.. సమీపంలోని పెట్రోల్ బంక్ వరకూ బస్సును తీసుకెళ్లి.. అక్కడున్న పీఎస్ కు బాలికను, నిందితుడిని తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న బాధిత బాలిక మావయ్య పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఘటనపై ఫిర్యాదు చేశారని ఏసీపీ తెలిపారు. నిందితుల్లో ఒకడైన మహ్మద్ ఆరిఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న లలిత్ కోసం గాలిస్తున్నారు.