Parliament Security Breach: పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలిసారి స్పందించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జరిగిన ఘటన దురదృష్టకరమని, దానిని తక్కువగా అంచనా వేయకూడదన్నారు. అలాగే ప్రతిపక్షాలు ఈ ఘటనపై అనవసరపు రాద్ధాంతం చేయకూడదని కోరారు. “దైనిక్ జాగరణ్” అనే వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు చట్ట సభల్లో పునరావృతం కాకుండా.. సమస్య లోతుల్లోకి వెళ్లి పరిష్కరించాలని ప్రధాని తెలిపారు.
పార్లమెంట్ లో జరిగిన భద్రతా వైఫల్యం ఘటన తననెంతో బాధించిందన్నారు. స్పీకర్ ఓం బిర్లా ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించగా.. దర్యాప్తుపై తమకు పూర్తి విశ్వాసం ఉందని ప్రధాని పేర్కొన్నారు. కుట్ర వెనుక ఉన్న నిజాలు త్వరలోనే బయటపడుతాయని ప్రధాని చెప్పినట్లు సదరు వార్తాసంస్థ పేర్కొంది.
అలాగే.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ సీఎంలుగా కొత్తవారిని ఎంపిక చేయడంపై ప్రధాని మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాల సీఎంలు నిజానికి కొత్తవారు కాదన్నారు. ప్రజల కోసం వారంతా ఎంతో కష్టపడ్డారని, ప్రజాసేవలో ఎంతో అనుభవం ఉందన్నారు. మీడియా దృష్టి కొన్ని కుటుంబాలకే పరిమితం కావడంతో.. ఇలాంటి వారి గురించి ఎవరికీ పెద్దగా తెలియలేదన్నారు.