Ayodhya: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జనవరి 22 వ తేదిన జరగనుంది. విగ్రహ ప్రాణప్రతిష్ట జరిగే రోజు భక్తుల రద్దీ ఎక్కువుగా ఉండే అవకాశం ఉంది. రద్దీని నివారించడానికి అయోధ్య కు రావడానికి బదులుగా భక్తులు స్థానిక దేవాలయాల్లో పూజలు నిర్వహించాలని రామ మందిర ట్రస్ట్ కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. నగరంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేదుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
దేశ విదేశాల నుంచి భక్తులు అయోధ్యకు పోటెత్తే అవకాశం ఉండటంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీ దృష్ట్యా వెయ్యికి పైగా రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
ఆలయ ప్రారంభం నాటి నుంచి తొలి వంద రోజుల పాటు వెయ్యికి పైగా రైళ్లు నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. జనవరి 19 నుంచి ఈ రైళ్లను నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. వంద రోజుల పాటు ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, పుణె, కోల్కతా, నాగ్పుర్, లఖ్నవూ, జమ్మూ సహా దేశవ్యాప్తంగా పలు నగరాల నుంచి అయోధ్యకు రైళ్లు నడపనున్నారు.
దీంతోపాటు, కొన్ని రైళ్లను ప్రత్యేకంగా భక్తుల కోసం రిజర్వ్ చేసి ఛార్టెర్డ్ సర్వీసులు అందించనున్నారు. ఇక, ఈ రైళ్లలో ప్రయాణించే భక్తులకు ఆహారం అందించేందుకు IRCTC ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రోజుకు 50వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 15 నాటికి అయోధ్య స్టేషన్ పనులు పూర్తి కానున్నాయి.
ఇప్పటికే ఆలయంలోని గర్భగుడి నిర్మాణం పూర్తి అయ్యందని.. ఆలయంలో విగ్రహాలు కూడా సిద్ధమయ్యాయని ట్రస్ట్ సభ్యులు చెప్పారు. ఆలయ నిర్మాణం పూర్తవ్వడానికి రెండు సంవత్సరాల సమయం పట్టొచ్చని ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు.
భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అయోధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పనులు ఈ సంతర్సరం చివరినాటికి పూర్తి అవుతాయని పేర్కొన్నారు. పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు 4.40 ఎకరాల విస్తీర్ణంలో హస్తకళల కేంద్రాలు, పర్యాటక, వాణిజ్య కేంద్రాలు, భక్తులకు విడిది కేంద్రాలు, భోజన శాలలు, పార్కింగ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మరో వైపు అయోధ్యలో అన్ని రకాల వస్తువుల రేట్లు పెరగడంతో పాటు హోటళ్లకు డిమాండ్ పెరిగింది.