Organs Donation: మనం చనిపోయిన నలుగురి జీవితాల్లో వెలుగు నింపవచ్చని నిరూపించారు ఆ కుటుంబ సభ్యులు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామానికి చెందిన రాము అనే యువకుడు బైక్ పై నుండి కింద పడి బ్రెయిన్ డెడ్ తో కోమాలోకి వెళ్ళాడు. యశోద హాస్పటల్ డాక్టర్ల సూచనతో కుటుంబ సభ్యులు రాముడి అవయవాలను ఇతరులకు దానం చేసేందుకు అంగీకరించారు. ఒకవైపు తమ బిడ్డ చనిపోయి విషాదంలో ఉన్న కుటుంబం ఎంతో సహృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా కొత్తకోట ప్రాంతానికి చెందిన నక్కల గోకరయ్య, అలివేలమ్మ దంపతుల కుమారుడు రాముడు (17) చిన్న చిన్న పనులు చేస్తూ.. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. డిసెంబర్ 12న రాముడు బైక్ పై వెళ్తూ.. అదుపుతప్పి కిందపడిపోయాడు. అతనికి తీవ్రగాయాలు కావడంతో.. స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్పించారు.
ఐసీయూలో చికిత్స చేసిన వైద్యులు.. రాముడు బ్రెయిన్ డెడ్ కు గురైనట్లు నిర్థారించారు. విషయం తెలుసుకున్న జీవన్ దాన్ వైద్యబృందం రాముడు కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు అతని అవయవదానానికి అంగీకరించడంతో.. అతని శరీరం నుంచి రెండు కిడ్నీలు, కాలేయం ను సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అమర్చారు. అలాగే కార్నియాలను చూపులేని వారికి అమర్చారు. తాను చనిపోయినా.. అవయవదానంతో రాముడు చిరంజీవుడిగా మిగిలిపోయాడు.