Rohit Sharma : ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపట్టి పదేళ్లు అప్రతిహితంగా రోహిత్ శర్మ ముందుకు నడిపించాడు. అయితే తనని ఒక అవమానకర రీతిలో అంబానీ గ్రూప్ కి చెందిన ముంబై ఇండియన్స్ పక్కన పెట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. ఆ సెగ ముఖేష్ అంబానీకి కూడా తగిలింది. ఇక్కడ మూడు అంశాలు తెరపైకి వస్తున్నాయి.
ఒకటి… కెప్టెన్సీ ఇస్తేనే వస్తానని హార్దిక్ పాండ్యా కండీషన్ పెట్టడం, అది ఆటగాళ్ల హక్కు. దానినెవరూ కాదనలేరు. రెండు… జట్టులో బూమ్రా, సూర్యకుమార్ ఉండనే ఉన్నారు. ఎవరూ లేనట్టు హార్దిక్ పాండ్యాను ఆగమేఘాలపై ఎందుకు రప్పించాల్సి వచ్చింది?
మూడు…వస్తే వచ్చాడు…అంత త్వరగా కెప్టెన్సీ అప్పగించాల్సిన అవసరం ఏముంది?
ఇప్పుడు రోహిత్ శర్మ ఫామ్ లో లేడా? అదీ కాదు. వన్డే వరల్డ్ కప్ లో 597 పరుగులు చేశాడు.
మరెందుకు అత్యవసరంగా మార్చాల్సి వచ్చిందనే ప్రశ్నలు నెట్టింట వినిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యా విషయంలో గుజరాత్- ముంబయి చర్చలు సాగిస్తున్నప్పుడే.. రోహిత్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. అయితే కాంట్రాక్ట్ డీల్ కుదరలేదు.
ఇకపోతే రోహిత్ మొదట్లో 2008 నుంచి 2010 వరకు డెక్కన్ చార్జర్స్ తరపున ఆడాడు. 2009లో ఆ జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2011కి ముంబయికి వచ్చిన రోహిత్ శర్మ, 2013లో కెప్టెన్ అయ్యాడు. అప్పటి నుంచి నేటివరకు 10 ఏళ్లపాటు జట్టుని ముందుండి నడిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వడానికి సముఖంగా ఉన్నట్టు సమాచారం.
అయితే రోహిత్ శర్మ నుంచి ఎటువంటి సంకేతాలైతే లేవు, ఉంటాడో, ఉండడో కూడా తెలీదు. మరి సాధారణ ఆటగాడిలా ఇదే జట్టులో కొనసాగుతాడా ? లేదా ? అనేది ఇంకా తెలీదు. కాకపోతే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై రోహిత్ శర్మ పాజిటివ్ గానే ఉన్నాడని ముంబై మేనేజ్మెంట్ చెబుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాకపోతే 2025లో జరిగే మెగా వేలానికి రోహిత్ ఏ జట్టులో ఉంటాడనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.