Free Bus Journey: ఆర్టీసీ బస్సుల్లో మహిళల తోపాటు పురుషులకు ఉచిత ప్రయాణం కల్పించాలని ఓ యువకుడు ఆందోళనకు దిగాడు. మగవారికి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరాడు.
వివరాలోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్టాండ్ ఎదురుగా పురుషులకు ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఓ యువకుడు ఆందోళన చేపట్టాడు. బస్టాండ్ ఎదురుగా బస్సులను నిలిపివేసి ఆందోళన నిర్వహించాడు. రాష్ట్ర ప్రభుత్వం ఆడవారికి ఉచిత ప్రయాణం కల్పించిందని, మగవారికి ఎందుకు ఆ సౌకర్యం ఇవ్వలేదని ప్రశ్నించాడు. బస్సులో మహిళలతోపాటు పురుషులకు సీట్లు కేటాయించి ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశాడు.
బస్టాండ్ ఆవరణలో బస్సుకు అడ్డంగా నిలబడి ఆందోళన చేస్తున్న యువకుడితో మహిళా ప్రయాణికులు వాగ్వివాదానికి దిగారు. మద్యం మత్తులో ఉన్న యువకుడిని స్థానికులు పక్కకు తీసుకెళ్లారు. యువకుడి ఆందోళనతో సుమారు 20 నిమిషాల పాటు బస్సులు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.