Rangareddy : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గొల్లూర్ ఎక్స్ రోడ్ లో గుర్తు తెలియని దొంగల ముఠా దారి దోపిడికి తెగబడింది. అర్ధరాత్రి వస్తున్న వాహనాన్ని కాపుకాసి మరీ ఆపి.. కత్తులతో బెదిరించి గుర్తు తెలియని ముగ్గురు దొంగలు దోపిడికి పాల్పడ్డారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్ లైలాండ్ వాహనంలో రమేష్, రాములు అనే ఇద్దరు వ్యక్తులు పెద్ద గోల్కొండ అవుటర్ రింగ్ రోడ్డు దిగి పాలమాకుల వైపు వస్తున్నారు. అయితే మార్గం మధ్యలో గొల్లూర్ ఎక్స్ రోడ్ వద్దకు రాగానే ఎదురుగా స్కూటీపై ముగ్గురు వ్యక్తులు వాహనాన్ని ఆపారు. ఆ ముగ్గురు వ్యక్తులు హిందీ భాషలో మాట్లాడుతూ వారి వెంట తెచ్చుకున్న కత్తులను చూపించి రమేష్, రాములును బెదిరించి.. వారి దగ్గరున్న రూ. లక్షా 35 వేలు తీసుకున్నారు.
అక్కడ నుండి పెద్ద గోల్కొండ అవుటర్ రింగ్ రోడ్డు వైపు పరారయ్యారు. దీంతో బాధితులు 100 మొబైల్ కు కాల్ చేయడంతో శంషాబాద్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.