Kurnool : ఓ సంప్రదాయం నాలుగు నెలల బాలుడి ప్రాణాలకు ముప్పు తెచ్చింది. ఈ ఘటన కర్నూల్ జిల్లా ఆదోని పట్టణంలోని కౌడల్పేట కాలనీలో శనివారం చోటు చెసుకుంది. కౌడల్పేట కాలనీకి చెందిన బందే నవాజ్, మోహమ్మది అనే దంపతులకు నాలుగు నెలల బాలుడు ఉన్నాడు. సంప్రదాయం ప్రకారం పిల్లాడి పెదవులకు చేపను తాకిస్తే ఆరోగ్యంగా ఉంటారని ఆ కుటుంబ సభ్యుల నమ్మకం.
శనివారం బాలుడి పెదవులకు చేపను తాకించే ప్రయత్నం చేశారు.చేతిలో ఉన్న చేప జారి పిల్లాడి నోట్లోకి వెళ్లిపోయింది. పిల్లాడి నోట్లో చేప ఇరుక్కుపోవడంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి అపస్మారక స్థితికి వెళ్లాడు. తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతికష్టం మీద గొంతులో ఇరుక్కున్న చేపను బయటకు తీశారు. దీంతో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.