Telangana assembly session: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగాయి. తొలిరోజే గత బీఆర్ఎస్ పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకపడ్డారు. టెన్త్ ,ఇంటర్, TSPSC పేపర్లు లీకైనా పట్టించుకోలేని అసమర్థత పరిపాలన బీఆర్ఎస్ చేసిందని ద్వజమెత్తారు. 30 లక్షల మంది నిరుద్యోగులను నష్టపోయేలా చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని అవకతవకలే జరిగాయన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను నూరు శాతం అమలు చేస్తామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉంటుందన్నారు.
ప్రగతిభవన్ గేట్లు బద్దలు కొట్టి ప్రజలకు ప్రవేశం కల్పించామని, సమస్యలను విన్నవించుకునే స్వేచ్చను ప్రజలకు కల్పించామన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఏ మాత్రం ప్రజా సమస్యలను పట్టించకోలేదని అందుకే ప్రజలు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఎంతోమంది సీనియర్లున్నా మాట్లాడేందుకు ఒక కుటుంబం వారే ముందుకొస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలనకే పరిమితమవుతుందని మరోసారి నిరూపించిందన్నారు. బీఆర్ఎస్ నేతల్లో మార్పు వస్తుందని అనుకున్నా కానీ ఇంకా రాలేదని విస్మయం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండిన వడ్లకు రూ.4200 లకు క్వింటాలు అమ్మారు ఎవరికి అమ్మినారో..ఎలా అమ్మారో విచారణకు సిద్ధమా .. బీఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకుంటే నేను విచారణకు అదేశిస్తానని సీఎం రేవంత్ రెడ్డి సివాల్ విసిరారు. విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో లేదని, ప్రతిపక్షంలో కూడా అబద్ధాలు చెప్తూనే ఉన్నారన్నారు.కేంద్ర లెక్కల ప్రకారం తెలంగాణ 10వ స్థానంలో ఉందన్నారు. గోవా పంజాబ్, హరియాణ రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉన్నాయన్నారు. కాలువల ద్వారా నీళ్ళు ఇస్తే పంప్ సెట్లు పెరుగుతాయా? కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇస్తున్నాం అనే వాదన శుద్ధ అబద్ధం అని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఇందరమ్మ రాజ్యాన్ని ప్రజలు కోరుకొని అధికారం అప్పగించారని, ఇందిరమ్మ రాజ్యం తెచ్చి తీరుతాం అని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేశారు.