Farmhouse MLAs Operation : గోడి-ఈడీ. ఇదే బీజేపీ స్ట్రాటజీ అంటూ ఫాంహౌజ్ మధ్యవర్తులు చెప్పారని సీఎం కేసీఆర్ వెల్లడించారు. గోడి అంటే సఖ్యత అని.. బీజేపీతో సఖ్యత లేదంటే ఈడీ ఉంటుందని సింహయాజులు అన్నారన్నారు. ఈ సందర్బంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు వచ్చిన ముగ్గురు మధ్యవర్తులు చెప్పిన విషయాలను కేసీఆర్ వివరించారు.
కర్నాటకలో ఎమ్మెల్యేలను కొన్నది తామేనని.. అక్కడి ఎమ్మెల్యేలకు తలపాగా చుట్టి, మారువేషం వేసి.. ట్రాక్టర్లలో కొంతదూరం తీసుకెళ్లి, ఆ తర్వాత బస్సుల్లో వారిని ముంబై తరలించినట్టు చెప్పారన్నారు.
మహారాష్ట్రలోనూ ఎమ్మెల్యేలను డీల్ చేసింది తామేనని రామచంద్ర భారతి గొప్పలు చెప్పుకున్నాడని కేసీఆర్ అన్నారు. మహారాష్ట్ర లూనావాలాలో ఓ ఖరీదైన రిసార్ట్ లో మకాం వేసి.. మొత్తం వ్యవహారాన్ని నడిపించానని చెప్పినట్టు తెలిపారు. ఢిల్లీ ఎయిమ్స్ అడ్డాగా తాను అనేక రాష్ట్రాల్లో స్పెషల్ ఆపరేషన్స్ చేస్తుంటానని.. చార్టెడ్ ఫ్లైట్స్ లో మాత్రమే ప్రయాణిస్తానని రామచంద్ర భారతి చెప్పారట.
ముగ్గురు మధ్యవర్తుల ఫోన్లు, ల్యాప్ టాప్ లు సీజ్ చేస్తే అందులో కీలక సమాచారం లభించినట్టు కేసీఆర్ తెలిపారు. 2015 నుంచి వాళ్ల చరిత్ర అంతా బయటకు వచ్చిందని.. అదంతా కోర్టుకు ఇచ్చేశామని చెప్పారు. వారి కాల్ డేటా, ల్యాప్ టాప్ డేటా 70-80 వేల పేజీల వరకూ ఉందని అదంతా ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్నట్టు కేసీఆర్ అన్నారు.
ఫాంహౌజ్ లో రికార్డు చేసిన 3 గంటల వీడియోను 1 గంటకు కుదించి మీడియాకు రిలీజ్ చేశారు. అందులో, ఒక్కొక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు 50 కోట్లు ఇస్తామని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ బి-ఫామ్ గ్యారెంటీ అంటూ హామీ ఇచ్చారు రామచంద్రభారతి.
ఆ వీడియోలో మధ్యవర్తులు పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు రామచంద్రభారతి. ఇలాంటి వ్యవహారాలన్నీ రాష్ట్ర పార్టీతో సంబంధం లేకుండా.. ముగ్గురు కీలక జాతీయ నేతలు చూస్తారని రామచంద్ర భారతి అంటున్నారు. బీఎల్ సంతోష్, అమిత్ షా, జేపీ నడ్డా.. ఈ ముగ్గురే మెయిన్ అన్నారు. బీజేపీ పొలిటికల్ పార్టీ అని.. బ్యాక్ ఎండ్ లో అంతా ఆరెస్సెస్ చూస్తుందని సెలవిచ్చారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారం తుషార్ చూస్తున్నారని.. ఆయన నుంచి బీఎల్ సంతోష్ దగ్గరికి వెళుతుందని చెప్పారు. సంతోష్ ఓకే చేశాకే.. మేటర్ అమిత్ షా, జేపీ నడ్డాల దగ్గరికి వెళ్తుందని రామచంద్ర భారతి అంటున్నట్టు ఆ వీడియోలో ఉంది.
ఈ మొత్తం వ్యవహారంపై సీఎం కేసీఆర్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అప్పట్లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేస్తే పార్టీలకు అతీతంగా కొట్లాడినామని.. ఇప్పుడు దేశంలో మళ్లీ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడగా.. న్యాయవ్యవస్థనే కాపాడాలని వేడుకున్నారు. ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్న ముఠాలను కఠినంగా శిక్షించాలని కోరారు కేసీఆర్.
మోదీకి అర్థమయ్యేలా హిందీలోనూ ఫైనల్ మెసేజ్ ఇచ్చారు. “మీరు ప్రధాని, నేను ముఖ్యమంత్రి.. ఎనిమిదేళ్లుగా కలిసి పని చేస్తున్నాం.. ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేస్తూ.. ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేస్తూ.. మీరు ఏం సాధిస్తారు? ఆ నిందితులను కఠినంగా శిక్షించాలని మనవి చేస్తున్నా” అంటూ హిందీలో మోదీకి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు సీఎం కేసీఆర్.