Kishan reddy: ఇటీవల కేరళ అయ్యప్పస్వామి క్షేత్రంలో తొక్కిసలాటలో బాలిక మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కేరళ సీఎం పినరయి విజయన్ కు కేంద్ర సాంస్కతిక,పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. అయ్యప్ప స్వామి భక్తులు 40 రోజులు పాటు ఆధ్యాత్మిక భావనతో కూడిన మండల దీక్ష తర్వాత శబరిమలలో కొలువై ఉన్న స్వామి వారిని దర్శించుకోవడం కోసం భారతదేశంలో వివిధ ప్రాంతాలనుండి కోటిమందికి పైగా భక్తులు కేరళ కు వస్తుండగా.. తెలుగురాష్ట్రాల నుండి దాదాపు గా 15 లక్షలకు పైగా భక్తులు వస్తుంటారని లేఖలో పేర్కొన్నారు.
శబరిమలలో సరైన వసతులు లేకపోవడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురి అవుతున్న విషయం పత్రికలు, ఛానల్స్ లో వస్తున్న వార్తలు ద్వారా తెలుసుకున్నాని.. భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని కేరళ సీఎం పినరయి విజయన్ కు విజ్ఞప్తి చేశారు. ఇందుకు కేంద్రం తరపు నుండి అన్ని విధాలుగా కేరళ ప్రభుత్వం కి సహకారం ఉంటుందని, భక్తులకు భోజనం, మంచినీరు, వైద్యం మొదలైనవి మెరుగుగా అందించాలని కోరారు. భక్తులకు సహాయం చేసేలా స్వచ్ఛంద సంస్థ సేవలను కూడా భాగస్వామ్యం చేసే దిశగా చొరవ తీసుకోవాలని, ప్రభుత్వ యంత్రాంగాన్ని మోహరించి అన్ని రకాల సహాయ చర్యలు తీసుకోవాలని కేరళ ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాసిన లేఖలో పేర్కొన్నారు.