SHAKEEL RICE SCAM: బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ చేసిన అక్రమాలు బయటకు వస్తున్నాయి. షకీల్ కు చెందిన రహీల్, రాస్, అమీర్, దాన్విక్ అనే నాలుగు రైస్ మిల్లులకు పౌరసరఫరాల శాఖ ద్వారా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇచ్చారు. ఇందుకు గాను 35 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సీఎంఆర్ కింద తిరిగి పౌరసరఫరాల శాఖకు ఇవ్వాల్సి ఉంది. అయితే కేవలం 5 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే తిరిగి ఇచ్చారు.
ఇక.. మిగిలిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇవ్వడం తనకు సాధ్యం కాదని షకీల్ చెప్పారు. ఈ నేపథ్యంలో మిగిలిన ధాన్యాన్ని ఏఆర్ ఇండస్ట్రీస్, ఆర్కామ్ ఇండస్ట్రీస్, అబ్దుల్ ఐ ఇండస్ట్రీస్, ఎఫ్ఎఎఫ్ ఇండస్ట్రీస్ అనే మరో నాలుగు మిల్లులకు కేటాయించినట్లు చూపించారు. ఇందుకు సంబంధించి ధాన్యం తమ మిల్లులకు బదిలీ అయినట్లు ఆ నాలుగు మిల్లులకు చెందిన యజమానులు లిఖితపూ ర్వకంగా రాసిచ్చారు.
ఏఆర్ ఇండస్ట్రీస్ నుంచి 2 వేల మెట్రిక్ టన్నులు, ఆర్కిమ్ నుంచి 1,000 మెట్రిక్ టన్నులు, అబ్దుల్ ఐ నుంచి 1,000 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే పౌరసరఫరాల శాకకు ఇచ్చారు. ఎఫ్ఎఎఫ్ ఇండస్ట్రీస్ నుంచి ఒక్క గింజ కూడా ఇవ్వలేదు. మిగిలిన 26 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ అధికారులు అడగగా, షకీల్ మిల్లుల నుంచి తమకు ధాన్యం రాలేదని చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ ఒత్తిడితోనే ధాన్యం బదిలీ అయినట్లు తాము రాసిచ్చామని మిల్లర్లు చెబుతున్నారు.
పౌరసరఫరాల శాఖ అధికారులు షకీల్ కు చెందిన మిల్లుల్లో తనిఖీలు చేస్తున్నారు. రెండు రోజుల్లో ధాన్యం, సీఎంఆర్ కు సంబంధించిన వివరాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పౌరసరఫరాల శాఖకు ఇవ్వాల్సిన సీఎంఆర్ బియ్యం విలువ సుమారు 60 కోట్లుగా ఉంది. సీఎంఆర్ ఇవ్వనందుకు గాను పౌరసరఫరాల శాఖ ఇప్పటికే షకీల్ కు చెందిన మిల్లులకు 10 కోట్లు జరిమానా విధించారు. ఈ జరిమానాను కూడా షకీల్ చెల్లించలేదు.