Jeevan Reddy: కాళేశ్వరం, మిషన్ భగీరథపై తక్షణమే న్యాయ విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనమండలిలో గవర్నర్ తమిళిసై ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడి గడ్డ బ్యారేజీ కుంగుబాటుపై న్యాయ విచారణ జరిపించాలన్నారు. ప్రభుత్వంపై భారం పడకుండా గుత్తేదారుతో కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించాలన్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును గత ప్రభుత్వం సాగునీటి కోసం వినియోగించకుండా పర్యాటకంగా వాడుకోవడం విడ్డూరమని ఆరోపించారు.
‘‘మిషన్ భగీరథ పథకం కమీషన్ల కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్టు అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని వసతులు ఉన్నా, రామగుండం కాదని యాదాద్రిలో పవర్ ప్లాంట్ పెట్టారన్నారు. విద్యుత్ విభాగంలో ₹80,000ల కోట్ల అప్పులు చేసి ప్రజలపై భారీ భారం మోపారన్నారు.
ఐటీఐఆర్ ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్రం అంటోందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాలన్నారు. కేంద్రం వివక్ష వల్ల జాతీయ హోదా సాధించలేకపోయాం. కృష్ణానదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం అడ్డుకోవాలన్నారు. కృష్ణా జలాలు కాపాడుకోవడంలో గత ప్రభుత్వం తరహాలో ఉదాసీనత వ్యవహరించరాదన్నారు. సాగు నీరు హక్కులు కాపాడటంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారన్నారు.