Purandeswari: జనసేనతో బీజేపీ పొత్తుపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కీలక కామెంట్స్ చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పర్యటించిన ఆమె.. దండమూడి జిల్లా కార్యకర్త సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జనసేనతో బీజేపీ పొత్తు ఉందని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు జనసేన ఎక్కడా చెప్పలేదన్నారు. ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం నిధులిచ్చిందని, పార్లమెంట్ సాక్షిగా అమరావతే ఏపీ రాజధాని అని కేంద్రం ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.
రాష్ట్రంలో కేంద్రం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. పోలవరం నిర్మాణానికి కూడా ప్రతి రూపాయి కేంద్రమే భరిస్తోందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండేలా పార్టీని సన్నద్ధం చేస్తున్నామని పురందేశ్వరి తెలిపారు. దొంగ ఓట్లపై తాముకూడా పోరాడుతున్నామని, నకిలీ ఐడీలతో ఓట్లు నమోదు చేస్తున్న విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
పీఎం ఆవాస యోజన కింద ఏలూరు జిల్లాకు లక్ష ఇళ్లను కేటాయించామన్న పురందేశ్వరి.. వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇళ్లు నిర్మించిందో శ్వేతపత్రం ఇవ్వాలన్నారు. ఆడుదాం ఆంధ్రా కాదు.. వైసీపీ నేతలే ఆంధ్రాతో ఆడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపైసా తమ జేబుల్లోకి వెళ్లాలనేది వైసీపీ ఆలోచన అని దుయ్యబట్టారు. తుపాను కారణంగా పొగాకు పంటలు బాగా దెబ్బతిన్నాయని, నష్టపోయిన రైతుల ఆర్తనాదాలు ఈ ప్రభుత్వానికి వినిపించట్లేదని విమర్శించారు. రాష్ట్రానికి ఏ రకంగానూ న్యాయం చేయని వైసీపీ ఏపీకి అవసరమా ? అని ప్రశ్నించారు.