Ayodhya Ram Mandir: అయోధ్యలో శ్రీ రాముని దేవాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని అయోధ్యకు వెయ్యికి పైగా రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు సమాచారం. రామ మందిరం ప్రారంభోత్సవాన్ని చూసేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తారు. కావున ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు అదనంగా ఈ రైళ్లను నడపనున్నట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో నిర్మిస్తోన్న శ్రీ రాముడి దేవాలయం ప్రారంభోత్సవానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న పవిత్ర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత జనవరి 23 నుంచి సాధారణ ప్రజలకు శ్రీరాముని దర్శనం కల్పించనున్నారు. దీంతో దేశ విదేశాల నుంచి భక్తులు భారీ ఎత్తున అయోధ్యకు పోటెత్తే ఆస్కారం ఉండడంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రారంభం నాటి నుంచి తొలి వంద రోజుల పాటు అయోధ్యకు 1000కి పైగా రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రైల్వే శాఖ వర్గాలు ప్రకటించాయి.
రామ మందిర ప్రారంభోత్సవానికి కొన్ని రోజుల ముందే ఈ రైళ్లను నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. వంద రోజుల పాటు జమ్ము కాశ్మీర్, ముంబాయి, చెన్నై, పూనె, కోల్ కత్త, బెంగుళూర్, నాగపూర్, లఖ్ నవు, బెంగుళూర్, డిల్లీ,ముంబాయి సహా దేశవ్యాప్తంగా పలు నగరాల నుంచి అయోధ్యకు రైళ్లు నడపనున్నట్లు తెలుస్తోంది.
దీంతోపాటు, కొన్ని రైళ్లను ప్రత్యేకంగా భక్తుల కోసం రిజర్వ్ చేసి ఛార్టెర్డ్ సర్వీసులు అందించనున్నట్లు సదరు వర్గాల సమాచారం. ఇక, ఈ రైళ్లలో ప్రయాణించే భక్తులకు ఆహారం, త్రాగు నీరు తదితర అవసరాలను అందించేందుకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు, భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని అయోధ్యలోని రైల్వే స్టేషన్లో ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు. రోజుకు 50వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 15 నాటికి అయోధ్య స్టేషన్ పనులు పూర్తి అవుతాయి .
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. 2024 జనవరి 22న గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత రామ్ లల్లా ప్రతిష్ఠాపన ప్రక్రియను ప్రారంభించి, 10 రోజుల పాటు ‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ ట్రస్టు నిర్ణయించింది. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు నాలుగు వేల మంది సాధువులు, 2,500 మంది ప్రముఖులు హాజరుకానున్నారు.