CMRF Cheques Scam: అధికారం పోయినా.. బీఆర్ఎస్ నేతలు మాత్రం అక్రమాలు ఆపడం లేదు. పేదలను, రోగులను జలగల్లా పట్టి పీడిస్తున్నారు. ఎప్పుడో మంజూరు అయిన CMRF చెక్కులను ఇవ్వడానికి ఇప్పుడు భారీగా లంచాలు గుంజుతున్నారు. ఎన్నికల ముందు రిలీజ్ అయిన CMRF చెక్కులను దాచేసిన బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు లబ్దిదారులకు ఫోన్లు చేస్తున్నారు.. చెయ్యి తడిపితేనే చెక్ ఇస్తామంటూ క్లియర్ కట్గా చెప్పేస్తున్నారు. మాజీ మంత్రి హరీశ్రావు పీఏనంటూ చెప్పుకుంటున్న నరేశ్.. ఇలానే సీఎంఆర్ఎఫ్ లబ్దిదారుల నుంచి లంచం వసూలు చేస్తూ బిగ్టీవీ కెమెరాకు రెడ్ హ్యాండెడ్గా దొరికేశాడు..
నరేశ్ హరీశ్రావు పేషీలో పనిచేసేవాడు.. హరీశ్రావుకు పీఏనని చెప్పుకుంటాడు. ఇతని చేతిలో భారీగా CMRF చెక్కులున్నాయి. ఇవన్నీ ఎన్నికలకు ముందు.. అంటే అక్టోబర్లో రిలీజ్ అయ్యాయి. వాటిని ఇప్పుడు ఇస్తూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇలానే ఒక CMRF లబ్దిదారుడికి ఫోన్ చేసిన నరేశ్.. మీ చెక్ రెడీగా ఉందని.. ఓ హోటల్ అడ్రస్ చెప్పి.. కలెక్ట్ చేసుకోమని చెప్పాడు. అతని వ్యవహారం తేడాగా ఉండడంతో.. బిగ్టీవీకి సమాచారం ఇచ్చారు లబ్దిదారుడు. అక్కడికి వెళ్లిన బిగ్టీవీ ప్రతినిధి నుంచి డబ్బులు తీసుకుని.. ఓ కవర్ అందించాడు నరేశ్. ఆర్థిక శాఖ మంత్రిగా హరీశ్రావు పేరుతో ఉన్న ఆ కవర్లో కేసీఆర్ పేరుతో రాసిన లెటర్, లబ్దిదారుడి పేరుతో 60 వేల రూపాయల చెక్ ఉన్నాయి.
పేదలు, వైద్య ఖర్చులు భరించలేని వారికి CMRF నుంచి ఆర్థికంగా సహాయం చేస్తుంటారు. వైద్య ఖర్చులకు అయిన బిల్లులను సమర్పిస్తే, సీఎం కార్యాలయం వాటిని పరిశీలించి కొంతవరకూ సాయం అందిస్తుంటారు. కానీ ఇలా వచ్చిన డబ్బులోనూ వాటాలు కావాలంటున్నారు హరీశ్రావు సిబ్బంది. రూ.60 వేలు వచ్చింది కాబట్టి రూ.5 వేలు ఇవ్వాల్సిందేనన్నాడు. చేతిలో డబ్బులు లేవంటే గూగల్ పే, ఫోన్ పే చేయాలన్నాడు. ఏటీఎంకి వెళ్లాలంటే.. వెళ్లి డబ్బులు తెచ్చే వరకూ ఇక్కడే ఉంటానని చెప్పాడు. చివరకు డబ్బులు తెచ్చి ఇస్తే గానీ చెక్ను చేతిలో పెట్టలేదు నరేశ్.
ఒకటీ రెండూ కాదు.. వందల సంఖ్యలో నరేశ్ దగ్గర సీఎంఆర్ఎఫ్ చెక్కులున్నాయి. ఇప్పటికే కొంతమంది దగ్గర నుంచి డబ్బులు తీసుకుని చెక్కులు ఇచ్చేశాడు. చెక్ కోసం ఎప్పటి నుంచో తిరుగుతున్నామన్న బిగ్టీవీ ప్రతినిధితో అసలు విషయం చెప్పేశాడు నరేశ్. ఎన్నికల కోడ్ కారణంగా ఇవ్వలేదని.. చాలా చెక్కులు తమ దగ్గరే ఉన్నాయని ఒప్పుకున్నాడు. ఎన్నికల సమయంలో ఇలా డబ్బులు వసూలు చేస్తే ఎక్కడ రివర్స్ అవుతుందోనన్న భయంతోనే వాటిని ఇంతకాలం తొక్కిపెట్టారు. అధికారం వచ్చాక దర్జాగా వసూలు చేసుకోవచ్చనుకున్నారు కానీ.. అధికారం కోల్పోవడంతో అయినకాడికంటూ ఇప్పుడు దండుకుంటున్నారు.
వాస్తవంగా అలాంటి చెక్లు జారీ కాకపోయి ఉంటే, ఆరోగ్య శాఖ లో హ్యాండోవర్ చేయాలి. కానీ వాటిని జాగ్రత్తగా బయటకు తెచ్చేసిన హరీశ్రావు సిబ్బంది.. ఇప్పుడు లంచాలు దండుకునే పనిలో పడ్డారు. అసలు ఇలా ఎన్ని చెక్కులు హరీశ్రావు టీమ్ దగ్గర ఉన్నాయి ? ఎంతమంది నుంచి ఇంతవరకూ డబ్బులు వసూలు చేశారో ప్రస్తుత ప్రభుత్వం తేల్చాలంటున్నారు బాధితులు. ప్రాణాపాయ రోగాల నుంచి బయటపడిన వారి నుంచీ ఇలా డబ్బులు పిండుకుంటున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు.
.
.