Munugode : మునుగోడు మహా సంగ్రామం ముగిసింది. ఓటరు మనోగతం ఈవీఎంలతో నిక్షిప్తమైంది. గెలిచేదెవరో ఆదివారం తేలిపోనుంది. అప్పటి వరకూ ఎవరి ధీమా వారిదే. విజయం మాదంటే మాదంటూ అన్ని పార్టీలు గాంభీర్యానికి పోతున్నాయి. లోలోన మాత్రం తెగ టెన్షన్ పడుతున్నారు నేతలు.
మునుగోడు పోలింగ్ సరళిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇంఛార్జిలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గంలో పోలింగ్ సరళిని ఎంక్వైరీ చేశారు. మునుగోడులో అనుసరించిన వ్యూహం మంచి ఫలితాన్ని ఇవ్వబోతోందని.. సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని.. ధీమా వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. రెండు నెలలుగా మునుగోడులో పని చేసిన పార్టీ నేతలందరినీ అభినందించారు.
మరోవైపు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం తమ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డినే గెలవబోతున్నట్టు ప్రకటించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మునుగోడు ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు వేశారంటూ ఓటర్లందరికీ పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్పారు. అధికార పార్టీ దౌర్జన్యాలకు ఎదుర్కొని పోరాటం చేసిన బీజేపీ శ్రేణులను బండి అభినందించారు. ఎన్నికల సంఘం, పోలీసులు అంతా అధికార పార్టీకి కొమ్ము కాసారని.. అయినా విజయం తమదేనని ధీమాగా చెప్పారు బండి సంజయ్.
అటు, కాంగ్రెస్ సైతం మునుగోడులో గెలిచేది తామేనంటూ బలంగా చెబుతుండటం ఆసక్తికరం.