KTR vs Ponnam: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో.. గవర్నర్ ప్రసంగంపై తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, వివేక్ లు మాట్లాడారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రభుత్వంపై మాటల దాడి చేశారు. శాసనసభ చరిత్రలోనే ఇలాంటి గవర్నర్ ప్రసంగం లేదని విమర్శించారు. గవర్నర్ ప్రసంగం విన్నాక రాబోయే ఐదేళ్లలో రాష్ట్రం ఎలా ఉండబోతుందో అర్థమవుతోందన్నారు. నక్క మోసం చేయనని, పులిమాంసం తినను అని వాగ్దానాలు చేసినట్లుగా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు. బీఆర్ఎస్ ఎక్కడ ఉన్నా ప్రజాపక్షంగానే ఉంటుందని, కాంగ్రెస్ దురాగతాలన్నింటినీ చెబుతామన్నారు.
అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. కేసీఆర్ ప్రసంగంలో పస తగ్గలేదు. గత కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో త్రాగు,సాగు నీటికి, కరెంట్ కు దిక్కు లేదన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ తప్ప ఏమైనా ఉందా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో 50 ఎకరాల రైతు అయినా సరే.. గుంపు మేస్త్రి లాగే ఉండేవారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో వలస బతుకులే ఉండేవని, బీఆర్ఎస్ వచ్చాకే తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. పదవుల కోసం పెదవులు మూసిన చరిత్ర కాంగ్రెస్ దే అన్నారు.
కేటీఆర్ ప్రసంగానికి మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డుతగిలారు. ప్రభుత్వంపై మాటల దాడి చేసిన కేటీఆర్ కు కౌంటరిచ్చారు. ఉమ్మడిరాష్ట్రంలో అన్యాయం జరిగింది కాబట్టే.. తెలంగాణను తెచ్చుకున్నామని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేసిన అభివృద్ధేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి సైతం.. కేటీఆర్ పై కౌంటర్ అటాక్ చేశారు. కొత్త ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలిస్తే తీసుకుంటామని.. దాడి చేస్తున్నట్లు మొదలుపెడితే.. ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటుందన్నారు.
పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలన బాగోలేదనే.. అందరం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం..తెచ్చుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. ఉద్యోగాలు, నీళ్లు ఇచ్చారా? 2014 తర్వాత.. పదేళ్లలో ఏం చేశారో మాట్లాడుకుందాం అన్నారు.
కేటీఆర్ ఉమ్మడి పాలనలో జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించగా.. ఇప్పటి ముచ్చట చెప్పాలని కాంగ్రెస్ అంటోంది. అంటే.. చరిత్ర గురించి మాట్లాడొద్దంటున్నారా ? అని కేటీఆర్ ఎదురు ప్రశ్న వేశారు. చరిత్ర దాచిపెడితే దాగేది కాదన్నారు. అధికార, ప్రతిపక్షానికి 1.8 శాతం మాత్రమే తేడా ఉందన్నారు.
.
.