తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వాడీవేడీగా చర్చ సాగుతోంది. గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉందని ప్రతిపక్ష నేత కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. తాము ప్రజల పక్షమేనని స్పష్టం చేశారు. గత కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యలు, ఆకలి కేకలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు.
కేటీఆర్ విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కొంత మందికి ప్రజాస్వామిక స్ఫూర్తికి అర్థం తెలియదన్నారు. మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకోరని చురకలు అంటించారు. గత పాలనలో కేసీఆర్ కు వివిధ పదవులు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు. యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, సింగిల్ విండో ఛైర్మన్ గా ఓడినా కేసీఆర్ ను మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీనేనని స్పష్టంచేశారు. ఎమ్మెల్యేకాకుండానే హరీశ్ రావుకు మంత్రి పదవి ఇచ్చిందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వివరించారు
ప్రతిపక్షాలకు 2014కు ముందు అభివృద్ధిపై కావాలంటే ఒక రోజు అంతా చర్చించుకుందామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ చెప్పే పాపాల్లో ఇప్పుడు ఆయన చుట్టూ కూర్చున్న వాళ్ల పాత్రే ఉందన్నారు. తమకు
ఐదేళ్లు సమయం ఉందని జరిగిన విధ్వంసం ఏంటో బయటపడతాయన్నారు. పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవని కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారుు. ప్రతిపక్ష పార్టీ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. వారు ప్రభుత్వానికి మంచి సలహాలు ఇస్తే తీసుకుంటామని చెప్పారు.
సీఎం రేవంత్రెడ్డి సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని హరీశ్ కౌంటర్ ఇచ్చారు. పొత్తు పెట్టుకోవటం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది కేసీఆరే అని హారీశ్ రావు అన్నారు. వైఎస్ఆర్ కేబినెట్ నుంచి 14 నెలలకే వైదొలిగామన్నారు.