వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ లో నిజంగా టీమ్ ఇండియా గెలిచి ఉంటే, రోహిత్ శర్మ విషయంలో వీళ్లందరూ ఇలాగే మాట్లాడేవారా? అనే ప్రశ్నలు నెట్టింట వినిపిస్తున్నాయి. ఐపీఎల్ ముంబై జట్టుకి కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాను జట్టు మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. ఇకనుంచి ముంబై ఇండియన్స్ టీమ్ ని పాండ్యా ముందుండి నడిపిస్తాడని పేర్కొంది.
దీంతో పదేళ్లుగా కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ, నేటి నుంచి కేవలం ప్లేయర్ గానే కనిపించేలా ఉన్నాడు. లేదంటే వేరే టీమ్ కి కెప్టెన్ గా వెళతాడో తెలీదు. వేలానికి మూడు రోజుల ముందు ఈ నిర్ణయం తీసుకున్నారంటే, నిర్ణయాన్ని రోహిత్ శర్మకే వదిలేసి ఉంటారని అనుకుంటున్నారు.
దీంతో నెట్టింట రోహిత్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. వెంటనే ముంబై ఇండియన్స్ జట్టును అన్ ఫాలో చేయడం మొదలుపెట్టారు. ఒకవైపు టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా వెళుతున్న రోహిత్ శర్మకు ఇది ఊహించని శరాఘాతం అని అంటున్నారు. ఎందుకంటే అక్కడ సిరీస్ అయిపోయిన తర్వాత అయినా ప్రకటిస్తే బాగుండేది. ఇప్పుడే కొంపలు అంటుకుపోయినట్టు చెప్పడం వల్ల వచ్చిన నష్టం ఏముందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆటగాళ్ల మనోభావాలతో ఆడుకోవడం ప్రతీ ఒక్కరికి అలావాటైపోయిందని మండి పడుతున్నారు. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబయి ఇండియన్స్కు పేరు ఉంది. 2013లో కెప్టెన్ గా రోహిత్ శర్మ బాధ్యతలు తీసుకున్నాడు. పదేళ్లుగా ముంబై జట్టుకు అనేక విజయాలు అందించాడు. రికార్డు స్థాయిలో 5 సార్లు ఐపీఎల్ విజేతగా నిలిపాడు.
2013, 2015, 2017, 2019, 2020 లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ విజేతగా నిలిచింది. అత్యధిక సార్లు ట్రోఫీ గెలిచిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ తో కలిసి సమఉజ్జీగా ఉంది. 2013-2023 వరకు మొత్తం 11 సీజన్లలో ముంబయి జట్టుని రోహిత్ ముందుండి నడిపించాడు.
2013 లో ఛాంపియన్స్ లీగ్ టీ 20లోనూ ముంబయి జట్టు విజేతగా నిలిచింది. కెప్టెన్ గా 163 మ్యాచ్ లకు 91 సార్లు జట్టుని గెలిపించాడు. 68 మ్యాచ్ ల్లో పరాజయం పాలైంది. నాలుగు మ్యాచ్ ల్లో ఫలితం తేలలేదు.
ఒకప్పుడు ముంబై ఇండియన్స్ కి ఆడిన హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ అయ్యాడు. 2022లో జట్టుకి టైటిల్ అందించాడు. తర్వాత 2023లో ఫైనల్ వరకు తీసుకువెళ్లాడు. వరల్డ్ కప్ ఓటమి తర్వాత మరి రోహిత్ శర్మ కెప్టెన్సీ వద్దన్నాడో, లేక తన వయసు 36 ఏళ్లు అయిపోయిందని అనుకున్నారో తెలీదు. హఠాత్తుగా నిర్ణయం ప్రకటించారు. దీంతో అభిమానులు మత్రం భగ్గుమంటున్నారు.