Hyderabad News today:
చెరువు మధ్యలో దొంగ బందీ! ఎస్, మీరు చదివింది కరెక్టే. చెరువు మధ్యలో బండరాయిపైకి చేరిన దొంగను బయటకు తీసుకొచ్చేందుకు పోలీసులు నానా పాట్లు పడుతున్నారు. హైదరాబాద్ శివార్లలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.
సూరారం చెరువు మధ్యలో ఉన్న బండరాయిపై ఓ దొంగ నిల్చున్నాడు. ఇల్లు గుల్ల చేస్తుండగా యజమానులు చూశారు. దొంగ దొంగ అంటూ కేకలు వేయడంతో స్థానికులు గుమికూడారు. దొంగను పట్టుకునేందుకు వెంబడించారు. వారి నుంచి తప్పించుకునేందుకు పారిపోతూ చెరువులోకి దూకేశాడు సదరు దొంగ. ఇంతలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు కూడా చెరువు దగ్గరకు చేరుకున్నారు. అయితే.. ఆ చెరువు మధ్యలో ఉన్న బండరాయిపైకి చేరిన దొంగ.. అక్కడి నుంచి ఒడ్డుకురాకుండా అలాగే ఉన్నాడు.
చెరువు మధ్య నుంచి బయటకు రమ్మని పోలీసులు ఎంత చెప్పినా దొంగ వినలేదు.తనను కొడతారంటూ మొండికేశాడు. చీకటి పడినా, దోమలు మూకుమ్మడి దాడి చేసినా లైట్ తీసుకున్నాడు. తెల్లారేసరికి అక్కడి నుంచి ఉడాయించాడు. కళ్లముందు దొంగ కనిపించినా, పోలీసుల చేతకానితనం వల్లే తప్పించుకున్నాడని స్థానికులు మండిపడుతున్నారు.తాళం పగులకొట్టి ఇంట్లోకి దొంగ ఎంటరయ్యాడని తమ కష్టార్జితం పాతిక వేలు దోచుకున్నాడని బాధితులు చెప్తున్నారు.
దొంగ తెలివిగా తప్పించుకున్నాడా? పోలీసులే అతన్ని పట్టుకోలేకపోయారా? మొత్తానికి చెరువు మధ్యలోని బండరాయిపైనుంచి దొంగ ఉడాయించాడు.