ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకీ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీలన్నీ దూకుడు పెంచాయి. ఈ క్రమంలోనే సీఎం జగన్ సారధ్యంలోని అధికార వైసీపీ కూడా పక్కా వ్యూహాలను రచిస్తోంది. వై నాట్ 175 అంటూ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్ ఇప్పటికే 11 నియోజకవర్గాలకు కొత్తగా ఇంఛార్జ్ లను కూడా ప్రకటించారు. దాంతో ఎవరు ఉంటార ఎవరు ఊడతారో తెలియని అయోమయంలో పడ్డారు నేతలు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ చేపట్టిన ఈ ప్రక్షాళన పార్టీ నేతల్ని కలవరపెడుతోంది.
ఉత్తరాంధ్రలో పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో యాక్షన్ ప్లాన్ కి వైసీపీ శ్రీకారం చుట్టింది. తమ ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు నేతలు వరుస పర్యటనలను చేయనున్నారు. మూడు రోజులపాటు ఉత్తరాంధ్రలోని పార్టీ ముఖ్యనేతలు, మంత్రులు పర్యటించి ప్రజలకు జరిగిన అభివృద్ధిపై తెలియజేయనున్నారు.
ఈ నెల 16న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును, 17న విజయనగరం మెడికల్ కళాశాలను, 18న మూలపేట పోర్టు పనులను వైసీపీ నేతలు పరిశీలించనున్నారు. ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు శంకుస్థాపనలకే టీడీపీ పరిమితమైందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్ధానం సమస్యకు సీఎం వైఎస్ జగన్ శాశ్వత పరిష్కారం చూపించారని అంటున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఉద్ధానంలో రూ. 750 కోట్లతో వైఎస్సార్ సుజల ధార ప్రాజెక్టు, రూ.85 కోట్లతో వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభించి హామీ నెరవేర్చారన్నారు.
అలానే సీఎం జగన్ ఉత్తరాంధ్రలోని నియోజకవర్గాలపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే విశాఖ జిల్లా అరకు, పాడేరు, అనకాపల్లి, పాయకరావుపేట నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ ల మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇచ్ఛాపురం, పాతపట్నం, ఎచ్చెర్ల, చోడవరంపై కూడా కసరత్తు చేస్తోంది వైసీపీ. ఇచ్ఛాపురం ఇన్ఛార్జ్గా బీసీ వర్గంనేతకు అవకాశమిచ్చే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాల సమాచారం.
పాతపట్నంలో రెడ్డి శాంతిని మార్చుతారని జోరుగా ప్రచారం జరుగుతుండగా, ఎచ్చెర్లలో చిన్న శ్రీను, బెల్లాన చంద్రశేఖర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక చోడవరం లోనూ కొత్త ఇంఛార్జ్ నియామకానికి ప్లాన్ చేస్తుండగా పాయకరావుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే బాబురావును మార్చే అవకాశమున్నట్టు కనబడుతోంది.