సాధారణంగా సమాజంలో న్యాయమూర్తి అంటే ప్రత్యేక గౌరవం ఉంటుంది. అలాంటి న్యాయమూర్తికే పని ప్రదేశంలో అత్యంత అవమానకర పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో సదరు న్యాయమూర్తి ఆత్మహత్య చేసుకొనేందుకు సిద్ధమైనట్లు కథనాలు వెలువడ్డాయి.
ఉత్తరప్రదేశ్ లో ఓ మహిళా న్యాయమూర్తికి పని ప్రదేశంలో లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. తనతో పని చేస్తున్న కొందరు సీనియర్లు లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. సీజేఐ చంద్రచూడ్ స్పందిస్తూ.. అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు లేఖ రాయాల్సిందిగా సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ ఎం. కుర్హేకర్ను ఆదేశించారు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని బాందా జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా సివిల్ జడ్జి రాసిన ఓ లేఖ తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. “సామాన్య ప్రజలకు న్యాయం చేసేందుకు న్యాయ వృత్తిలో చేరిన నేను ఇప్పుడు అదే న్యాయం కోసం ప్రతి తలుపు తట్టాల్సి వస్తోంది. గత కొన్ని నెలలుగా జిల్లా న్యాయమూర్తి, ఆయన అనుచరులు నాపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. నన్ను పురుగు కంటే హీనంగా చూస్తున్నారు”. అని లేఖలో పేర్కొన్నారు.
ఇప్పటికే ఆమె ఫిర్యాదును ఐసీసీ సీజ్ చేయడంతో ఆమె దాఖలు చేసిన రిట్ పిటిషన్ బుధవారం కొట్టివేయడం గమనార్హం. ఎనిమిది సెకన్ల విచారణ తర్వాత సుప్రీంకోర్టు తన కేసును కొట్టివేసిందని మహిళా న్యాయమూర్తి లేఖలో పేర్కొన్నారు. రాత్రిపూట తనను కలవాలని జిల్లా జడ్జి కోరారని ఆమె ఆరోపించారు.
“నాకు ఇక జీవించాలనే కోరిక లేదు. గత ఏడాదిన్నరగా నన్ను నడిచే శవంగా మార్చారు. ప్రాణం లేని, నిర్జీవమైన ఈ శరీరాన్ని ఇకపై మోయడం వల్ల ప్రయోజనం లేదు. నా జీవితంలో ప్రయోజనం లేదు” రెండు పేజీల లేఖలో పేర్కొన్నారు. “ఆడపిల్లలు బొమ్మలా లేదా జీవం లేని వస్తువుగా ఉండటం నేర్చుకోవాలని నేను సలహా ఇస్తున్నాను” అని ఆమె పేర్కొన్నారు.